డేంజన్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత నుండి డేంజర్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి ఓ రాష్ట్రం చేరుకున్నదంటే మామూలు విషయం కాదు. డేంజర్ జోన్లోకి వెళ్ళినందుకు ప్రభుత్వ యంత్రంగాన్ని, జనాలను ఇద్దరినీ తప్పు పట్టాల్సిందే. ఇదే సమయంలో సేఫ్ జోన్లోకి చేరుకున్నదంటే కూడా ప్రభుత్వం+జనాలను అభినందించాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయిన ఢిల్లీ మళ్ళీ సేఫ్ జోన్లోకి చేరుకోవటమే.

ఢిల్లీలో ఏప్రిల్ నెలకు ముందు రోజుకు 30 వేల కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీలో సమస్య ఏమిటంటే కొన్ని విభాగాలు రాష్ట్రప్రభుత్వం చేతిలో ఉంటాయి. మరికొన్ని శాఖలు కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. వైద్యారోగ్య శాఖ ఏమో కేజ్రీవాల్ చేతిలో ఉంటే పోలీసు శాఖేమో నరేంద్రమోడి ఆధీనంలో పనిచేస్తుంది.

ఇపుడు కరోనా వైరస్ సమస్య అదుపులోకి రావటానికి కేంద్రమైనా, రాష్ట్రప్రభుత్వాలైనా లాక్ డౌన్ అని కర్ఫ్యూ అని నిబంధనలు విధిస్తున్నాయి. అయితే ఢిల్లీలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల మధ్య సఖ్యత లేని కారణంగా కేజ్రీవాల్ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏమి అమలు చేయాలన్నా సాధ్యంకాదు. దాంతో కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి. దాంతో వేరేదారి లేక కేంద్రంతో మాట్లాడి సంపూర్ణ లాక్ డౌన్ విధించేశారు. లాక్ డౌన్ విధించటంతోనే మంచి ఫలితాలు వచ్చాయని చెప్పచ్చు.

గడచిన 24 గంటల్లో ఢిల్లీలో నమోదైన కేసులు 3 వేలు మాత్రమే. అలాగే 252 మంది చనిపోయారు. ఇదే ఒకపుడు కేసులు, మరణాలు కూడా వేలల్లో నమోదయ్యేవి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాల ప్రకారం పాజిటివిటి రేటు 10 శాతం దాటితే డేంజర్ జోన్లోకి ప్రవేశించినట్లే. అలాగే 5 శాతంలో ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్లే. అంటే ఢిల్లీ చాలా స్పీడుగా డేంజర్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ అంతే స్పీడుగా సేఫ్ జోన్లోకి వచ్చేసిందనే చెప్పాలి. మరి ఇదే సేఫ్ జోన్ కంటిన్యు అవ్వాలంటే జనాలు సహకరిస్తే మాత్రమే సాధ్యమవుతుంది.