జగన్‌ సర్కారుకు ‘ఆర్మీ’ పంచ్?


ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు కోర్టులు ఎదురు దెబ్బలు తగలడం చాలా మామూలు విషయం అయిపోయింది. గత రెండేళ్లలో జగన్ సర్కారు ఎన్నిసార్లు కోర్టులతో మొట్టికాయలు వేయించుకుందో లెక్కే లేదు. వివిధ కేసుల్లో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులోనూ షాక్ తప్పేలా లేదు.

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారని, వివిధ వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద సీబీఐ ఆయనపై కేసులు పెట్టడం.. అరెస్టు చేసి జైలుకు తరలించడం తెలిసిందే. ఐతే పోలీసులు రఘురామను కొట్టారంటూ ఆయన లాయర్లు కోర్టును ఆశ్రయించడం.. పాదాలు కమిలిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం తెలిసిందే. ఐతే అవి పోలీసులు కొడితే అయిన గాయాలు కావని.. చర్మ సమస్య కారణంగానే కాళ్లు అలా అయ్యాయని ప్రభుత్వం నియమించిన వైద్య బృందం నివేదిక ఇచ్చింది.


కానీ ఈ నివేదికపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రఘురామకు హైదరాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశించడం తెలిసిందే. కాగా అక్కడ పరీక్షలు పూర్తయ్యాయి. ఆర్మీ ఆసుపత్రి కోర్టుకు నివేదిక కూడా సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం రఘురామ కాలిలో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. అదే సమయంలో రఘురామకు ఎడీమా అనే చర్మ సమస్య ఉండే అవకాశం ఉందని కూడా నివేదికలో తేల్చినట్లు తెలుస్తోంది.

ఐతే రఘురామకు అయిన గాయాలు సొంతంగా చేసుకున్నవి అయ్యుండొచ్చనే అనుమానాన్ని ప్రభుత్వం తరఫు లాయర్ వ్యక్తం చేయగా.. దీనిపై విచారించాలని పేర్కొంటూ ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ నివేదిక జగన్ సర్కారుకు తలనొప్పిగా మారుతుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు కొట్టడం వల్లే ఈ గాయాలు అయ్యాయని కోర్టు ఒక అభిప్రాయానికి వస్తే ఈ కేసు సీఐడీ మెడకు చుట్టుకోవడం ఖాయం.