కేరళ మోడల్ లో చంద్రబాబు వెళ్ళక తప్పదా ?

పార్టీ బలోపేతం అవ్వాలన్నా, పూర్వవైభవం రావాలన్నా అర్జంటుగా చంద్రబాబునాయుడు కేరళనే ఆదర్శంగా తీసుకోవాలేమో. తొందరలో కేరళకు ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపధ్యంలో 20వ తేదీన కొలువు తీరబోతున్న మంత్రివర్గంలో అందరు కొత్తముఖాలే కనబడబోతున్నాయి. సీపీఎం నుండి ప్రమాణం చేయబోయే 12 మంది మంత్రులూ కొత్తవారే.

ఇక సీపీఎం భాగస్వామ్య పార్టీ అయిన సీపీఐ, కేరళా కాంగ్రెస్ కూడా కొత్త వారికే అవకాశాలు కల్పించాలని డిసైడ్ చేశాయి. సీపీఐ నుండి ఐదుగురికి మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. వీళ్ళంతా కూడా కొత్తవారే. అలాగే కేరళ కాంగ్రెస్ నుండి బాధ్యత తీసుకోబోతున్న మంత్రి కూడా మొదటిసారి అవుతున్నారు.

ముఖ్యమంత్రి తప్ప మిగిలిన మంత్రులందరినీ నూరుశాతం కొత్తవారిని ఎంపిక చేసిన పార్టీలు చెప్పేదేమంటే ప్రభుత్వానికి కొత్త రక్తం ఎక్కించాలని డిసైడ్ చేసినట్లు. మంత్రులుగా కొత్తవారిని ఎంపికచేస్తే కొత్తఉత్సాహంతో ఫుల్ జోష్ తో పనిచేస్తారని పార్టీలు భావిస్తున్నాయి. అందుకనే ఎలాంటి మొహమాటం లేకుండా భాగస్వామ్య పార్టీలన్నీ సీనియర్లను పక్కన పెట్టేశాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు కూడా కేరళ మోడల్ నే ఎందుకు ఫాలో అవకూడదు ? అనే సందేహాలు మొదలయ్యాయి. పార్టీలో కూడా ఇపుడిదే చర్చ మొదలైంది. పార్టీలో వృద్ధతరం పెరిగిపోవటంతో భారంగా తయారయ్యారు. ఎప్పుడో 40 ఏళ్ళక్రితం పార్టీ పెట్టినపుడు ఎంఎల్ఏలు, ఎంపిలు, మంత్రులైన వాళ్ళే ఇప్పటికీ అధికారాలను అనుభవిస్తున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వృద్ధతరానిదే పెత్తనమైతే ఇక యువకులు, కొత్తవారు వచ్చేదెప్పుడు ? అనే చర్చ పెరిగిపోతోంది.

నిజానికి పార్టీకి బలమైన ఓటుబ్యాంకుతో పాటు క్యాడర్ కూడా ఉంది. నేతలు పార్టీని వదిలిపోయినా క్యాడర్ మాత్రం చెక్కచెదరలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నూరుశాతం ప్రక్షాళన మొదలుపెట్టాలి. కేరళ స్పూర్తితోనే సీనియర్లను వదిలించుకుని యువరక్తానికి అవకాశాలు ఇస్తేనే పార్టీకి జవసత్వాలు వస్తాయి. మొహమాటానికి వెళ్ళి సీనియర్లతోనే నెట్టుకొద్దామని అనుకుంటే పుట్టిముణిగిపోవటం ఖాయం.