ఏక్ మిని క‌థ ఓటీటీ రిలీజ్ డేట్‌ ఫిక్స్?


కరోనా సెకండ్ వేవ్ ధాటికి థియేట‌ర్లు మూత ప‌డి దాదాపు నెల రోజులు కావ‌స్తోంది. ఏపీలో క‌ర్ఫ్యూ, తెలంగాణ‌లో లాక్ డౌన్ నెలాఖ‌రు వ‌రకు కొన‌సాగ‌బోతున్నాయి. వ‌చ్చే నెల‌లో కూడా థియేట‌ర్లు తెరుచుకోవ‌డం అనుమానంగానే ఉంది. దీంతో గ‌త ఏడాది లాగే ఓటీటీల్లో కొత్త చిత్రాల‌ను నేరుగా రిలీజ్ చేసే దిశ‌గా నిర్మాత‌లు అడుగులు వేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

పెద్ద‌, మీడియం రేంజ్ సినిమాలు ఇంకొంత స‌మయం వేచి చూడొచ్చు కానీ.. చిన్న సినిమాల‌కు మంచి డీల్స్ వ‌స్తే ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేసేయ‌డం బెట‌ర్ అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ చిత్రాన్ని ఇలాగే రిలీజ్ చేసేయ‌గా.. గ‌త నెల 30న థియేట్రిక‌ల్ రిలీజ్‌కు రెడీ అయి త‌ర్వాత వాయిదా ప‌డ్డ మ‌రో చిన్న చిత్రం ఏక్ మిని క‌థ‌ను త్వ‌ర‌లోనే ఓటీటీలో వ‌దిలేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

యువి క్రియేష‌న్స్ వారి యువి కాన్సెప్ట్స్ అనే బేన‌ర్లో తెర‌కెక్కిన ఏక్ మిని క‌థను అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయ‌డానికి ఒప్పందం కుదిరిన‌ట్లు స‌మాచారం. డీల్ ఎంత అన్న‌ది ప‌క్క‌న పెడితే ఇంకో ప‌ది రోజుల్లోనే ఈ సినిమా ప్రైమ్‌లోకి వ‌చ్చేయ‌నుంద‌ట‌. మే 27న ఏక్ మిని క‌థ ప్రిమియ‌ర్స్‌కు ముహూర్తం కుదిరింద‌ట‌.

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ క‌థ‌తో కార్తీక్ రాపోలు అనే డెబ్యూ డైరెక్ట‌ర్ రూపొందించిన ఈ బోల్డ్ ఫిలింలో సంతోష్ శోభ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. కావ్య థాప‌ర్ క‌థానాయిక కాగా.. సుద‌ర్శ‌న్ కామెడీ రోల్ చేశాడు. ఈ సినిమా ప్రోమోలు ఫన్నీగా ఉండి ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షించాయి. కాన్సెప్ట్ కొంచెం బోల్డ్‌గా ఉండ‌టంతో ఈ టైపు సినిమాల‌కు ఓటీటీ రిలీజే క‌రెక్ట్ అనే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే ఓటీటీ ప్రిమియ‌ర్స్ గురించి మేక‌ర్స్‌ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.