టీడీపీలో ఇదో చిత్రం.. స‌ఖ్య‌త లేని కీల‌క నేత‌లు..!


ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో చిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింది. అయిన‌ప్ప‌టికీ.. కొన్ని కొన్ని జిల్లాల్లో పార్టీ పేరు నిల‌బ‌డింది. తూర్పుగోదావ‌రి, విజ‌య‌వాడ, ప్ర‌కాశం.. విశాఖ‌.. వంటి జిల్లాల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. సీనియ‌ర్లు ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. క‌లివిడిగా ఉండి.. పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌ని.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఎక్క‌డా కూడా నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. కొన్నిరోజులు.. విశాఖ‌లో క‌లిసి ప‌నిచేసినా.. త‌ర్వాత‌.. వాసుప‌ల్లి గ‌ణేష్ టీడీపీకి బైచెప్పారు.

ఇక‌,మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు సైతం.. పార్టీకి దూర‌మ‌య్యారు. ఆయ‌న ఎక్కడ ఉన్నారో కూడా తెలి య‌డం లేదు. ఫ‌లితంగా విశాఖ‌లో పార్టీ ముందుకు సాగ‌డం లేదు. ఇదే జిల్లాలో స‌బ్బం హ‌రి మృతి పార్టీకి పెద్ద లోటే. ఇక విశాఖలో ఎంత‌మంది నేత‌లు ఉన్నా మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడి వాయిస్ ఒక్క‌టే వినిపిస్తోంది. తూర్పు గోదావ‌రిలో మాజీ హోం మంత్రి చిన‌రాజ‌ప్ప‌ను అనేక నియోజ‌క‌వ‌ర్గాల నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు. య‌న‌మ‌ల పేరు చెపితేనే ప‌లువురు కీల‌క నేతలు దూరం జ‌రుగుతున్నారు.

రాజ‌మండ్రి రూరల్‌, సిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీని ఢీ కొట్టి మ‌రీ.. గెలిచినా.. టీడీపీకి సంతోషం క‌నిపించ‌డం లేదు. దీంతో సిటీ, రూర‌ల్ ఎమ్మెల్యేల మ‌ధ్య పైకి మాత్రం బాగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం విభేదాలు సాగుతున్నాయి. బుచ్చ‌య్య‌ను హ‌వాను అడ్డుకునేందుకు ఆదిరెడ్డి వ‌ర్గం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, ప్ర‌కాశంలోనూ న‌లుగురు ఎమ్మెల్యేలు గెలిచినా.. వీరిలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎవ‌రికివారే య‌మునా తీరే.. అన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఒక‌రిద్ద‌రు పార్టీ అధిష్టానం మాట వింటే.. మిగిలిన వారు.. మౌనంగా ఉంటున్నారు.. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు.

ఇక‌, విజ‌య‌వాడ‌లో ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యే ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారైనా.. ఎవ‌రికివారుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇటీవ‌ల కార్పోరేష‌న్ ఎన్నిక‌ల వేళ న‌గ‌ర పార్టీ నేత‌లు ఏకండా రోడ్డెక్కి విమ‌ర్శ‌లు చేసుకుని పార్టీ ప‌రువు బ‌జారుకు ఈడ్చారు. అనంత‌లో మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ వ‌ర్గం వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి వ‌ర్గాల మ‌ధ్య నాలుగేళ్ల నుంచి రాజుకున్న నిప్పు ఆరేలా లేదు స‌రిక‌దా ? పార్టీ మ‌రింత నాశ‌నం అవుతోంది. అదే జిల్లాలో హిందూపురం మాజీ ఎంపీకి ప‌లువురు మాజీ ఎమ్మెల్యేల‌కు పొస‌గ‌డం లేదు.

నెల్లూరులో పార్టీ చిత్తుగా ఓడినా కీల‌క నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక .. ఇటు నియోజ‌క‌వ‌ర్గాలు, అటు పార్టీ కూడా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. టీడీపీలో మార్పు వ‌స్తుందా ? రాదా ? చంద్ర‌బాబు వీళ్ల‌ను ఎలా దారిలోకి తెచ్చుకుంటారో ? చూడాలి.