లాక్ డౌన్ పొడిగింపు తప్పదా? అయితే ఎన్ని రోజులు?

కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కారు.. దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క రోజుల పాటు లాక్ డౌన్ ను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా వేసుకున్న అంచనా వర్క్ వుట్ అయినప్పటికీ.. ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన మర్కజ్ వ్యవహారంతో ఇప్పుడు లెక్కలన్ని తప్పుతున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా పెరుగుతున్న కరోనా కేసుల్ని కంట్రోల్ చేసేందుకు వీలుగా లాక్ డౌన్ నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. మర్కజ్ ఎపిసోడ్ విషయంలో జరిగిన పొరపాట్లు ప్రభుత్వ లెక్కల్ని తలకిందులు అయ్యేలా చేశాయి.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న ముగియాల్సిన లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగింపు తప్పదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగించాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయసమాచారం ప్రకారం.. ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దాలంటే లాక్ డౌన్ పొడిగింపు తప్పనిసరన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం మర్కజ్ కేసులే ఎక్కువ. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నిలిపివేయటం.. దేశీయంగా రాకపోకలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థానికంగానే తప్పించి. .దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కొత్తగా వ్యాపించే అవకాశమే లేదు. అదే సమయంలో మర్కజ్ పరిణామాలతో అలెర్ట్ అయిన కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు జల్లెడ పడుతూ.. అనుమానితుల్ని క్వారంటైన్ చేస్తూ.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ ఫలితాలు రానున్న కొద్ది రోజుల్లో బయటకు రానున్నాయి. వాటిని అనుసరించి.. వారి కారణంగా కాంటాక్టు అయిన వారిని గుర్తించి.. వారికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకోవాల్సిన పరిస్థితి. దీనికి సమయం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 అర్థరాత్రి వరకూ ప్రకటించిన లాక్ డౌన్ ను తక్కువలో తక్కువ మరో పద్నాలుగు రోజుల వరకూ పొడిగించే వీలుందని చెబుతున్నారు.

ఎందుకంటే.. ఏప్రిల్ పది నాటికి మర్కజ్ కారణంగా పాజిటివ్ కేసులు ఎన్ని అన్నది తేలిపోయే అవకాశం ఉంది. అప్పటి నుంచి మరో దఫా జల్లెడ పట్టటానికి.. అప్పటికే లక్షణాలు ఉన్నా.. బయటపడని వారిని గుర్తించేందుకు కాస్త సమయం అవసరం. అందుకు ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ కు ఎంత లేదన్నా మరో పద్నాలుగు రోజులు విధించక తప్పదంటున్నారు.

మర్కజ్ కు హాజరైన వారు.. వారి కారణంగా కలిసిన వారితో కలిపి దేశ వ్యాప్తంగా 22 వేల మంది వరకూ ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. వారిలో ఇప్పటివరకూ 1023 మందికి పాజిటివ్ కాగా.. మరికొందరు వివిధ దశల్లోక్వారంటైన్ లో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో ఉన్న వీరి కారణంగా మరెంతమంది బాధితులు అయ్యే అవకాశం ఉందన్న విషయంపైనా కేంద్రం క్షుణ్ణంగా ఆరా తీస్తోంది.

 గడిచిన మూడు నాలుగు రోజులుగా రోజుకు మూడు.. నాలుగు వందల పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. కష్టమైనా మరికొంత కాలం లాక్ డౌన్ పొడిగిస్తే తప్పించి.. కరోనాను కంట్రోల్ చేసే అవకాశం లేదని చెప్పకతప్పదు. సో.. ఏప్రిల్ నెలాఖరు వరకూ లాక్ డౌన్ విధించే అవకాశాలే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.