ఒక వైసీపీ మూడు గ్రూపులు.. ఎన్ని చిక్కులో ?

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో గ్రూపుల గ‌లాటా రోజు రోజుకు పెరిగిపోతోంది. ప‌లు జిల్లాల్లో మంత్రులు వ‌ర్సెస్ ఎంపీలు, ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు గ్రూపులు రాజ్యం ఏలుతుండ‌డంతో స‌ద‌రు ఎమ్మెల్యేలు గ్రూపుల గోల‌లో చిక్కుకుపోతున్నారు. ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ్రూపుల గోల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక చెక్క మాదిరిగా ఉంది.

2009లో ప్ర‌జారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సంచ‌ల‌నం క్రియేట్ చేసిన రాంబాబు ఆ త‌ర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో ఆ పార్టీలోకి వెళ్లారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ అధికారంలో ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ప‌నులు చ‌క్క‌పెట్టారు. అయితే 2014లో వైసీపీ నుంచి గెలిచిన ముత‌ముల అశోక్‌రెడ్డి టీడీపీలో చేరిపోవ‌డంతో రాంబాబు ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. చివ‌ర‌కు ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి 81 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాన‌న్న ఆనందం రాంబాబుకు లేకుండా పోయింది. నియోజ‌క‌వ‌ర్గంలో జిల్లాకే చెందిన ఓ మంత్రి పెత్త‌నం ఎక్కువుగా ఉంద‌ట‌. ముఖ్యంగా ఓ ప్ర‌ధాన సామాజిక వ‌ర్గం నేత‌లు స‌ద‌రు మంత్రి ద్వారా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసేశారు. ఇప్పుడు ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా స‌ద‌రు మంత్రి ద్వారా వారే చ‌క్రం తిప్పేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే రాంబాబు డ‌మ్మీగా మారారా ? అన్న చ‌ర్చ‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి. అన్నా రాంబాబు టీడీపీలో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌తో న‌డిచిన వ‌ర్గం కూడా ఇప్పుడు వైసీపీలో ఉంది.

ఇక గ‌తంలో 2014లో అశోక్‌రెడ్డిని గెలిపించి.. పార్టీ మార‌కుండా పోరాటం చేసిన వ‌ర్గం కూడా వైసీపీలో స్ట్రాంగ్‌గా ఉంది. ఇక స‌ద‌రు మంత్రి అండ‌దండ‌ల‌తో పార్టీలోకి వ‌చ్చిన టీడీపీ వ‌ర్గం ( గ‌తంలో అశోక్‌రెడ్డి వెంట ఉన్న నేత‌లు) కూడా వైసీపీలో మూడో వ‌ర్గంగా ఉంది. చివ‌ర‌కు అన్నా రాంబాబు పేరుకు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీలో వ‌ర్గాలు బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌న క‌క్క‌లేక మింగ‌లేక చందంగా ఉంటున్నార‌ట‌. ఇక నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప‌ద‌వులు కూడా త‌న ప్ర‌మేయం లేకుండా భ‌ర్తీ అవుతుండ‌డంతో ఆయ‌న గోడు గోడ‌కు చెప్పుకోవ‌డం మిన‌హా చేసేదేం లేద‌ని నిట్టూరుస్తున్నార‌ట‌.