కోవిషీల్డ్ సెకండ్ డోస్ గ్యాప్.. ఇలా మార్చేస్తే ఎలా?


వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నాక 28 రోజులకు రెండో డోస్ వేసుకోవాలి.. ఇదీ మొదట్లో ప్రచారంలో ఉన్న విషయం. కానీ తర్వాత ఆ విరామం 42 రోజులు అంటూ అప్ డేట్ వచ్చింది. ఇండియాలో మెజారిటీ ప్రజలకు వేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్‌కు మధ్య ఉండాల్సిన విరామం కనీసం ఆరు వారాలంటూ తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది.

తొలి డోస్ వేసుకున్న తర్వాత 6-8 వారాల మధ్య సెకండ్ డోస్ వేసుకోవచ్చన్నారు. గత రెండు నెలల్లో కోవిషీల్డ్ వేసుకున్న వాళ్లందరూ దీన్నే అనుసరించారు. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న దాదాపు 15 కోట్ల మందికి రెండు డోస్‌ల మధ్య ఇచ్చిన విరామం ఆరు వారాలు. ఐతే ఇదంతా జరిగాక ఇప్పుడు తీరికగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య ఉండాల్సిన విరామంపై కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది.

రెండో డోస్ 12 నుంచి 16 వారాల మధ్య వేసుకోవచ్చన్నది తాజా మార్గదర్శకాల్లో చేసిన సూచన. ఐతే కొవిడ్ వ్యాక్సిన్ అంటే ఆషామాషీ విషయం కాదు. కరోనా దేశంలో ఎలా విలయానికి కారణమవుతోందో తెలిసిందే. వైరస్ ముప్పు తప్పించుకోవడానికి, వైరస్ వచ్చినా ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ తప్ప మరో మార్గం లేదన్నది అందరూ చెబుతున్న మాట. అలాంటపుడు వ్యాక్సినేషన్ సరిగ్గా జరగడం కీలకం. కానీ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు మారిపోతుండటంతో ఏ గ్యాప్‌తో రెండు డోస్‌లు వేసుకుంటే శరీరానికి ఎక్కువ రక్షణ లభిస్తుందో తెలియని అయోమయంలో జనాలు పడిపోతున్నారు.

నిజానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోస్ తర్వాత 12 నుంచి 16 వారాల మధ్య రెండో డోస్‌ వేసుకుంటే అది ఎక్కువ ప్రభావవంతంగా పని చేస్తున్నట్లుగా ఫిబ్రవరిలోనే యూకేలో ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఐతే దీన్ని మన ప్రభుత్వ సంస్థలు పట్టించుకోలేదు. ఆ నివేదిక బయటికి వచ్చిన మూడు నెలలకు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం నిర్లక్ష్యానికి సూచిక అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.