షర్మిల సంచలనం.. 040-48213268 నెంబరుకు ఫోన్ చేస్తే చాలట

తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలన్న ఆశను.. ఆకాంక్షను ఇప్పటికే వ్యక్తం చేసిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల.. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే తండ్రీకొడుకులు అంటూ కేసీఆర్.. కేటీఆర్ లపై ఘాటు విమర్శలు చేస్తున్న ఆమె.. నిన్నటికి నిన్న కేసీఆర్ పాలన తీరుపైనా.. కొవిడ్ వేళ నెలకొన్న కొరతపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు.

కొవిడ్ కారణంగా ఇంటి పెద్ద మరణించి.. ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయితే ఆర్థికంగా అండగా నిలిచేందుకు తన వంతు సాయం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ఎంతోమంది కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిందని వాపోయారు. కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. ఆమె వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్ పేరుతో ఒక సహాయ కార్యక్రమాన్ని ఆమె ప్రకటించారు.

కొవిడ్ కారణంగా ఇంటి పెద్ద కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేనని.. అలాంటి కుటుంబాన్ని నెట్టలేక ఎంతోమంది మహిళలు నిరాశలో పడిపోయారన్నారు. అలాంటి వారికి సాయాన్ని అందించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పిన ఆమె.. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారెవరైనా సరే 040-48213268 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు.

పోయిన వారిని తీసుకురాలేమని.. కానీ.. సదరు మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని తాను అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి మహిళలు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే.. ఆపదలో తోడుగా ఫోన్ నెంబరుకు సమాచారం ఇస్తే.. వారికి తగిన రీతిలో సాయం చేస్తానని ఆమె ట్వీట్ రూపంలో ప్రకటించారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.