రఘురామకృష్ణరాజు అరెస్టుపై ఎవరేమంటున్నారు?

ఎంతో కాలంగా ఎదురుచూసిన రోజు వచ్చేసింది. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అరెస్టు చేసిన ఆయన్ను ఏపీకి తరలించారు. పుట్టినరోజున ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయటం గమనార్హం. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన ఈ ఉదంతం హాట్ హాట్ గా మారింది. సొంత పార్టీ అధినేత మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా ఆరోపణలు ఎదుర్కోవటంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టినంతనే ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారానికి తగ్గట్లే ఆయన్ను అరెస్టు చేశారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై వైసీపీ నేతలు పలువురు స్పందిస్తున్నారు. వారితో పాటు.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎంపీ అరెస్టుపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ ఇప్పుడు సైకోలా మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు.

‘వాడి గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. వైసీపీ టికెట్ కోసం పడిగాపులు కాశాడు. జగన్ బొమ్మతో గెలిచి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. రఘురామ విషయంలో జగన్ చాలా ఓపికతో వ్యవహరించారు. ఆయనపై నేరుగా వ్యక్తిగత దూషణలు చేసినా సహించారు. ఆయన ఓపిక పట్టటం వల్లే ఇన్నాళ్లు రఘురామ రెచ్చిపోయారు.ఇప్పుడు అతడు చేసిన తప్పులకు చట్టం తని పని తాను చేసుకుంటూ పోతుంది’ అని సీరియస్ అయ్యారు.

నరసాపురం ఎంపీ రఘురామ అరెస్టును తాము ఖండిస్తున్నట్లుగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలో జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని.. అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందన్నారు. రఘురామ అరెస్టు కక్ష సాధింపులో భాగంగా జరిగిందన్నారు. వారెంట్ లేకుండా ఎంపీని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు ఖాకీ డ్రెస్సును పక్కన పెట్టి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు.. రఘురామ అరెస్టుపై వైసీపీ నేత శ్రీరంగనాథ రాజు స్పందించారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని.. గడిచిన 13 నెలలుగా నరసాపురం పార్లమెంటు ప్రజల్ని వదిలేసి.. ఢిల్లీ.. హైదరాబాద్ లలో మకాం ఏర్పాటు చేసుకున్నారన్నారు. నరసాపురం పరిధిలో నమోదైన కేసులపైనా పోలీసులు విచారణ జరిపించాలన్నారు. పార్టీ సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉంటే.. ఎంపీ రఘురామ మీద హైదరాబాద్ లో మరో కంప్లైంట్ నమోదైంది. కులం పేరుతో రెడ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. కులాలు.. వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైంట్ చేశారు. రఘురామ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓసీ సంక్షేమ సంఘం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.