జగన్ ఆరోపణలపై భారత్ బయోటెక్ స్పందన


ఓవైపు కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ప్రాణాలు నిలిపే సంజీవనిగా భావిస్తున్న వ్యాక్సిన్ డిమాండుకు తగ్గట్లు సరఫరా లేక దేశవ్యాప్తంగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సిన్ నిల్వలు మరీ తక్కువగా ఉన్నాయి. కొత్త వాళ్లకు తొలి డోస్ వేయడం సంగతలా ఉంచితే.. ఇప్పటికే ఫస్ట్ డోస్ వేసుకుని, సెకండ్ డోస్ వేసుకోవాల్సిన గడువు రావడంతో టీకా కేంద్రాలకు వెళ్తుంటే నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి.

ఐతే ఈ విషయంలో తమ వైఫల్యం ఏమీ లేదంటూ జగన్ సర్కారు చేతులెత్తేస్తోంది. నెపాన్ని కేంద్రంతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి మీద, ఈనాడు అధినేత రామోజీ రావు మీద నెట్టేస్తున్నారు వైకాపా నేతలు. భారత్ బయోటెక్ నుంచి కోవాగ్జిన్ నిల్వలు ఏపీకి రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న అర్థం వచ్చేలా స్వయంగా సీఎం జగనే ప్రెస్ మీట్లో ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.

ఐతే ఈ సంక్షోభ సమయంలో పూర్తిగా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం మీదే దృష్టిపెట్టి ఈ ఆరోపణలపై సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ బయోటెక్ అధినేతలు.. ఇప్పుడు మౌనం వీడుతున్నారు. తమ గురించి దుష్ప్రచారం చేస్తుండటంతో సంస్థ అధినేతల్లో ఒకరైన సుచిత్ర ఎల్లా స్పందించారు. నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా సీఎం జగన్ పేరు ఎత్తకుండా.. పరోక్షంగానే తమకు దురుద్దేశాలు ఆపాదించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 10న ప్రయారిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా 18 రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసులను పంపామని.. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులను బట్టి చిన్న చిన్న షిప్‌మెంట్లే పంపించామని.. ఐతే కొన్ని రాష్ట్రాలు తమకు దురుద్దేశాలు ఆపాదించడం చాలా బాధిస్తోందని ఆమె తెలిపారు.

తమ సిబ్బందిలో కూడా 50 మంది దాకా కరోనా బారిన పడ్డారని.. ఇలాంటి పరిస్థితుల్లో తమ సంస్థ 24 x 7 కష్టపడుతూ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తోందని ఆమె ట్విట్టర్లో వివరించారు. మరోవైపు సంస్థ మరో అధినేత కృష్ణా ఎల్లా వ్యాక్సిన్ డోసులకు సంబంధించి తమకు లేఖ రాసిన ఢిల్లీ ప్రభుత్వానికి జవాబు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపుతున్నామని, అంతకుమించి తాము చేసేదేమీ లేదని అందులో ఆయన స్పష్టం చేశారు.