శ్రుతి హాసన్‌కు ఆర్థిక ఇబ్బందులా?


శ్రుతి హాసన్ పదేళ్లుగా సినిమాల్లో కథానాయికగా కొనసాగుతోంది. కెరీర్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డా.. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. చాలా వేగంగా దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంది. మరి ఇన్నేళ్లుగా ఎన్ని కోట్లు సంపాదించి ఉంటుందో అంచనా వేయొచ్చు. మధ్యలో వ్యక్తిగత కారణాలతో కొంచెం గ్యాప్ తీసుకున్నప్పటికీ.. మళ్లీ కథానాయికగా బిజీ అయింది. ‘క్రాక్’, ‘లాభం’ లాంటి పెద్ద సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘సలార్’లోనూ నటిస్తోంది.

ఇలాంటి హీరోయిన్‌కు ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే నమ్మగలమా? షూటింగ్‌లు ఆగిపోయి ఇబ్బంది పడుతూ.. మళ్లీ అవి ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూసే పరిస్థితుల్లో శ్రుతి ఉందట. తన తండ్రి ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ ఒక వయసు వచ్చాక ఆయన మీద తాను ఆధారపడలేదని.. తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నమే చేశానని.. ఐతే లాక్ డౌన్ కారణంగా తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డానని శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

“ఎప్పుడు షూటింగ్స్ మొదలైతే అప్పుడు వెళ్లి పని చేద్దామని చూస్తున్నా. నాక్కూడా ప్రొఫెషనల్ కమిట్మెంట్లు ఉన్నాయి. ఆర్టిస్టులుగా మా సంపాదన భిన్నంగా ఉంటుంది. మేం చెల్లించాల్సిన బిల్లులు చాలా ఉంటాయి. నా పరిధి నాకు ఉంది. తల్లి దండ్రుల సాయం నేను కోరను. లాక్ డౌన్ మొదలవడానికి ముందు నేను ఒక ఫ్లాట్ కొన్నాను. వ్యక్తిగత ఖర్చులకు తోడు ఎన్నో బిల్లులు చెల్లించాలి. ప్రతి నెలా ఈఎంఐలు కట్టాలి. కానీ సామాన్య జనాల కష్టాలతో పోలిస్తే నాలాంటి వాళ్ల కష్టాలు చాలా చిన్నవని మాత్రం ఒప్పుకుంటా” అని శ్రుతి వెల్లడించింది.