15 తర్వాత లాక్ డౌన్ తప్పదా ?

పెరిగిపోతున్న కరోనా ఉదృతిని నియంత్రించటానికి ఈనెల 15వ తేదీ తర్వాత లాక్ డౌన్ పెట్టడం తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. లాక్ డౌన్ విధించటానికి 15వ తేదీకి సంబంధం ఏమిటంటే రంజాన్ పండుగ కాబట్టే. ఈనెల 13-14 తేదీల్లో రంజాన్ పండగుంది. రంజాన్ అయిపోగానే లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో కేసీయార్ ఉన్నట్లు సమాచారం.

నిజానికి మొదటినుండి లాక్ డౌన్ విధించటానికి కేసీయార్ పూర్తి వ్యతిరేకం. సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే ఆర్ధికంగా జరగబోయే భారీ నష్టాలను లెక్కేసే కేసీయార్ మొదటినుండి వ్యతిరేకిస్తున్నారు. అందుకనే లాక్ డౌన్ స్ధానంలో ప్రత్యామ్నాయంగా నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే నైట్ కర్ఫ్యూ ప్రభావం పెద్దగా కనబడలేదు. దాంతో ఉదయం పూట కూడా పాక్షికంగా కర్ఫ్యూని విధించింది. దీనివల్ల కూడా పెద్దగా ఉపయోగం కనబడలేదు.

కర్ఫ్యూ దారి కర్ఫ్యూదే, కరోనా తీవ్రత కరోనాదే అన్నట్లుగా ఉంది వ్యవహారం. దాంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించినట్లే తెలంగాణాలో కూడా టోటల్ లాక్ డౌన్ విధించటం ఒకటే మార్గమని ప్రభుత్వానికి అర్ధమైనట్లుంది. అందుకనే ఇదే విషయమై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతున్నట్లు సమాచారం. వెంటనే రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తే కానీ కరోనా తీవ్రత నియంత్రణలోకి రాదని ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి నివేదికలు అందించారట.

ఇదే సమయంలో వైద్యావసరాల కోసం ఏపి, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్నాటక నుండి వేలాదిమంది రోగులు హైదరాబాద్ వస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం వస్తున్నారు కాబట్టి వీళ్ళను అడ్డుకునేందుకులేదు. అప్పటికి ఏపి నుండి వస్తున్న రోగులను సరిహద్దుల్లో అడ్డుకోవటం వివాదాస్పదమైంది. ఇలాంటి అనేక సమస్యలకు లాక్ డౌన్ విధించటమొకటే పరిష్కారమని ఉన్నతాధికారులు కేసీయార్ తో చెప్పారట. కాబట్టి మంత్రివర్గంలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.