ఐపీఎల్ కుర్రాడు.. అయ్యో పాపం

చేతన్ సకారియా.. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలో ఆగిపోవడానికి ముందు, లీగ్ ఆరంభంలో మార్మోగిన యువ ఆటగాళ్ల పేర్లలో ఇదొకటి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఐపీఎల్లో ఈ కుర్రాడు మెరుపు ప్రదర్శనలు చేశాడు. రెండు మ్యాచుల్లో మూడేసి వికెట్లు పడగొట్టాడు. ప్రతిభావంతులైన లెఫార్ట్ పేసర్లు కరవైన భారత క్రికెట్లో ఈ కుర్రాడు ఆశాకిరణంలా కనిపించాడు. సౌరాష్ట్రాకు చెందిన చేతన్ వయసు 23 ఏళ్లే.

ఐతే ఈ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించడానికి ముందు చేతన్ పెద్ద విషాదాన్ని చూశాడు. కరోనా వైరస్ సోకి అతడి సోదరుడు మృతి చెందాడు. ఆ సంగతలా ఉంచితే దేశవాళీ సీజన్లో చక్కటి ప్రదర్శన చేసిన చేతన్ ప్రతిభను గుర్తించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్.. ఈ కుర్రాడిని రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ముస్తాక్ అలీ, విజయ్ హజారె ట్రోఫీల్లో చక్కటి ప్రదర్శన చేసి.. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో శ్రమించి లీగ్‌లోకి అడుగు పెట్టాడు చేతన్.

ఈ సీజన్లో రాయల్స్ తొలి మ్యాచ్ నుంచే తుది జట్టులో చేతన్‌ను ఆడించగా, తనపై జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ చక్కటి ప్రదర్శన చేశాడు. ఐతే లీగ్ మధ్యలో ఆగిపోయే సమయానికి చేతన్ తండ్రి కాంజీబాయ్ సకారియా కరోనా బారిన పడ్డాడు. టోర్నీ ఆగగానే బబుల్ నుంచి అతను నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. తన సోదరుడు చనిపోయాక ప్రస్తుతం ఇంట్లో తానొక్కడినే సంపాదన పరుడినని, ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులు తన తండ్రి చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఆయన్ని కాపాడుకుంటామని రెండు రోజుల కిందట మీడియాకు వివరించాడు చేతన్.

ఐతే అతడి మాటలు నెరవేరలేదు. 42 ఏళ్ల కాంజీబాయ్ కరోనాతో పోరాడి ఓడిపోయాడు. నెలన్నర కిందటే సోదరుడిని కోల్పోయిన చేతన్.. ఇప్పుడు తండ్రినీ దూరం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆకట్టుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కనిపించిన ఈ యువ ఫాస్ట్‌బౌలర్.. నెలన్నర వ్యవధిలో సోదరుడిని, తండ్రిని కోల్పోయి ఎంతటి వేదన అనుభవిస్తుంటాడో అర్థం చేసుకోవచ్చు. భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి సైతం ఇలాగే కొన్ని రోజుల వ్యవధిలో సోదరి, తల్లిని కరోనా కారణంగా కోల్పోవడం తెలిసిందే. తాజాగా సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి సైతం కరోనాకే బలవడం విచారకరం.