బాబుకు నోటీసులు ఇవ్వ‌లేదు… రీజ‌నేంటంటే?

ఏపీ విప‌క్ష నేత‌గా కొన‌సాగుతున్న‌ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేయ‌నున్నార‌ని, క‌ర్నూలు వ‌న్ టౌన్ సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ నోటీసులు తీసుకుని మ‌రీ హైద‌రాబాద్ చేరుకున్నార‌ని, ఏ క్ష‌ణ‌మైనా చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేయ‌నున్నార‌ని ఆదివారం ఉద‌యం నుంచి రాత్రి దాకా ఒక‌టే హంగామా న‌డిచింది.

చంద్ర‌బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేసిన త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు ఏమిట‌న్న కోణంలో పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగాయి. అయితే… ఆదివారం రాత్రి పొద్దుపోయే దాకా కూడా చంద్ర‌బాబు చేతికి పోలీసులు నోటీసులు అందించ‌లేదు. దీంతో ఉద‌యం నుంచి న‌డిచిన హంగామా మొత్తం చ‌ప్పున చ‌ల్లారిపోయిన‌ట్టైంది. అయినా క‌ర్నూలు నుంచి పోలీసుల బృందంతో క‌లిసి హైద‌రాబాద్ చేరుకున్న క‌ర్నూలు వ‌న్ టౌన్ సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ ఏ కార‌ణం చేత చంద్ర‌బాబుకు నోటీసులు అందించ‌లేద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

చంద్ర‌బాబు చేతికి పోలీసులు నోటీసులు అందించలేక‌పోడానికి కార‌ణ‌మిదేనంటూ రెండు రీజ‌న్లు ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది టీడీపీ ర‌చించిన వ్యూహ‌మేన‌న్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ వ్యూహ‌మేమిట‌న్న విష‌యంలోకి వెళితే… త‌మ‌ నేత‌ల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు వైసీపీ స‌ర్కారు పాల్ప‌డుతోంద‌ని భావిస్తున్న టీడీపీ దానికి విరుగుడు మంత్రాన్ని క‌నిపెట్టింది. క‌ర్నూలు జిల్లాలో క‌రోనా కొత్త వేరియంట్ ఎంట్రీ ఇచ్చింద‌న్న వాద‌న‌ను వినిపించినందుకే చంద్ర‌బాబుపై కేసు న‌మోదు అయిన వైనాన్ని ప‌రిశీలించిన టీడీపీ నేత‌లు… చంద్ర‌బాబు మాదిరే ఈ కొత్త వేరియంట్ పై వైసీపీ నేత‌లు ఎవ‌రైనా మాట్లాడారా? అన్న కోణంలో ఆలోచించార‌ట‌.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ కేబినెట్ లో కాస్తంత ఆల‌స్యంగా జాయిన్ అయిన మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కొత్త వేరియంట్ పై వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసింద‌ట‌. ఇంకేముంది… చంద్ర‌బాబుపై ఏ కార‌ణంతో కేసు న‌మోదు చేశారో?.. అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు మంత్రి సీదిరి కూడా చేశారు క‌దా… ఆయ‌న‌పైనా కేసు న‌మోదు చేయండ‌ని టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ర‌వికుమార్ క‌ర్నూలు వ‌న్ టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందే స‌మ‌యానికే సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ త‌న బృందంతో క‌లిసి హైద‌రాబాద్ వెళ్లిపోయార‌ట‌. దీంతో ఏం చేయాలో పాలుపోని వ‌న్ టౌన్ పోలీసులు విష‌యాన్ని త‌మ సీఐతో పాటు త‌మ శాఖ ఉన్న‌తాధికారుల‌కు చేర‌వేశార‌ట‌. దీంతో సీదిరిపై కేసు న‌మోదు అంశం తేలేదాకా చంద్ర‌బాబుకు నోటీసుల జారీ అంశాన్ని వాయిదా వేయాల‌ని పోలీసు బాసుల నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ట‌.

ఇక చంద్ర‌బాబుకు నోటీసుల నిలిపివేత‌కు మ‌రో అంశం కూడా కార‌ణంగా క‌నిపిస్తోంది. క‌రోనా నేపథ్యంలో చంద్ర‌బాబు హైద‌రాబాద్ లోని త‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. పార్టీ కార్య‌క్ర‌మాలు, ఇత‌ర‌త్రా ఏదేనీ కార్య‌క్ర‌మ‌మైనా జూమ్ ద్వారానే నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద సెక్యూరిటీ విధులు నిర్వ‌హిస్తున్న వారిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యం తెలిసిన మీద‌ట క‌ర్నూలు నుంచి హైద‌రాబాద్ చేరుకున్న క‌ర్నూలు వ‌న్ టౌన్ సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ… విష‌యాన్ని త‌న పై అధికారుల‌కు చేర‌వేశార‌ట‌.

చంద్ర‌బాబు ఇంటివ‌ద్ద సెక్యూరిటీ గార్డుల‌కు క‌రోనా సోకితే… అక్క‌డికి వెళ్లి అన‌వ‌స‌రంగా క‌రోనా బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్న భావ‌న‌తో ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబుకు నోటీసుల జారీని తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని బాసుల నుంచి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ఆదేశాలు జారీ అయ్యాయ‌ట‌. దీంతో నోలీసుల‌తో హైద‌రాబాద్ వ‌చ్చిన వెంక‌ట‌ర‌మ‌ణ‌… వాటిని చంద్ర‌బాబుకు అందించ‌కుండానే వెనుదిరిగార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా బాబుకు నోటీసుల జారీ వాయిదాప‌డిపోయిన వైనం కూడా హాట్ టాపిక్ గానే మారిపోయింద‌ని చెప్పాలి.