ఈ నెల చూద్దాం.. తర్వాత వదిలేద్దాం


కరోనా కథ ముగిసిందని.. ఇక థియేటర్లకు గండం గడిచినట్లే అని.. మళ్లీ ఎప్పుడూ గత ఏడాది చూసిన సంక్షోభం మళ్లీ రాదని అనుకున్నారు సినీ జనాలు. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మళ్లీ థియేటర్లలో సినిమాల ప్రదర్శన ఆగిపోయింది. థియేటర్లు మూత వేయాలని ప్రభుత్వాలేమీ అధికారికంగా ఆదేశాలేమీ జారీ చేయలేదు.

కానీ కరోనా ఉద్ధృతి నేపథ్యంలో యాజమాన్యాలే స్వచ్ఛందంగా మెజారిటీ థియేటర్లను మూసేశాయి. కొత్త సినిమాల విడుదల లేదు. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లే మూడ్‌లో ఎంతమాత్రం లేరు. అలాంటపుడు ఇక థియేటర్లను తెరుచుకుని ఏం చేస్తారు? చివరగా ‘వకీల్ సాబ్’ సినిమాతో థియేటర్లు కళకళలాడాయి. అంతటితో కథ ముగిసింది. మూడు వారాలకు పైగానే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మళ్లీ ఎప్పుడు అవి కొత్త సినిమాలు, జనాలతో కళకళలాడతాయో తెలియట్లేదు.

మళ్లీ పరిస్థితులు బాగుపడితే కొత్త సినిమాలను థియేటర్లలోకి వదులుదామని.. నిర్మాతలు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాటపర్వం లాంటి పెద్ద సినిమాలతో పాటు ఇష్క్, ఏక్ మిని కథ లాంటి చిన్న సినిమాలు ఫస్ట్ కాపీలతో రెడీగా ఉన్నాయి. నారప్ప, దృశ్యం-2, సీటీమార్ లాంటి సినిమాలు కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా, సత్యదేవ్ ‘తిమ్మరసు’ సైతం విడుదలకు దాదాపు సిద్ధమైనట్లే. వీటిలో ఏది ఎప్పుడు ప్రేక్షకులను పలకరిస్తుందో తెలియట్లేదు. మరోవైపు ఓటీటీలు కొత్త కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి.

థియేటర్లు నడవని ఈ పరిస్థితుల్లో కొత్త సినిమాలను రిలీజ్ చేస్తే ఓటీటీలకు ప్రయోజనం ఉంటుంది. అందుకే మంచి రేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ థియేటర్ల మీద ఆశలు వదులుకోవట్లేదు నిర్మాతలు. కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడితే రెండు మూడు వారాల్లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని.. మళ్లీ థియేటర్లు తెరుచుకుంటాయని, జనాలు వస్తారని ఆశిస్తున్నారు. కాబట్టి మే నెల అంతా ఎదురు చూద్దామని.. నెలాఖరుకు కూడా పరిస్థితులు ఆశాజనకంగా మారకపోతే ఓటీటీ రిలీజ్ గురించి ఆలోచిద్దామని చూస్తున్నారట. వచ్చే నెలలోనూ థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేకపోతే పైన చెప్పుకున్న సినిమాల్లో కొన్ని ఓటీటీల్లో నేరుగా రిలీజ్ అయిపోవడం గ్యారెంటీ.