ఆ లెజెండ్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు

సుశీల్ కుమార్.. దేశం గర్వించదగ్గ రెజ్లింగ్ క్రీడాకారుడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. 2008 ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన అతను తర్వాతి ఒలింపిక్స్‌లో రజతం అందుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగానూ అతను ఘనత వహించాడు. ఇంకా ఎన్నో గొప్ప విజయాలు, ఘనతలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇలాంటి దిగ్గజ క్రీడాకారుడు ఇప్పుడు ఓ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుండటం.. అతడి కోసం 50 మంది దాకా పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి గాలిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 4న సాగర్ అనే రెజ్లర్ ఢిల్లీలోని ఛత్రశాల రెజ్లింగ్ స్టేడియం ప్రాంగణంలో హత్యకు గురయ్యాడు. అతడితో పాటు మరో ఇద్దరు స్నేహితులను ఓ గ్యాంగ్ హాకీ, బేస్ బాల్ బ్యాట్లతో చితకబాదింది. ఈ క్రమంలో సాగర్ తలకు బలమైన గాయం తగిలి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ప్రిన్స్ అనే ఒక రెజ్లర్‌ను అరెస్టు చేయగా.. అతడి దగ్గర లభించిన ఫోన్లో దాడి ఘటన మొత్తం రికార్డ్ చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్ సైతం బాధితులపై దాడికి పాల్పడుతున్న దృశ్యం ఉందట.

బాధితుల్లో ఒకరు సుశీలే తమ మీద దాడి చేసినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సాగర్‌కు, సుశీల్‌కు పాత గొడవలు ఉన్నట్లు తెలిసింది. ఒకప్పుడు సాగర్.. సుశీల్ ఇంట్లోనే అద్దెకు ఉండేవాడు. కొన్ని నెలల పాటు అద్దె చెల్లించకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాలని సుశీల్ ఆదేశించాడట. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ తలెత్తి.. అందరి ముందు సుశీల్‌ను బద్మాష్ అనే కాక మరికొన్ని బూతులు తిట్టాడట సాగర్. తర్వాత సుశీల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయినప్పటికీ అందరి దగ్గర తన గురించి చెడుగా చెబుతుండటంతో సుశీల్ అతడిపై తన బృందంతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఐతే ఈ దాడిలో సాగర్ ఏకంగా ప్రాణాలే కోల్పోయి మర్డర్ కేసు సుశీల్ మెడకు చుట్టుకుంది.