కరోనా సంక్షోభంపై మోడిని దుమ్ముదులిపేసిన లాన్సెట్

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతికి నరేంద్రమోడి చేతకానితనమే ప్రధాన కారణమంటు ప్రముఖ లాన్సెట్ జర్నల్ దుమ్ముదులిపేసింది. ప్రపంచ మెడికల్ రంగంలో లాన్సెట్ అత్యంత ప్రాచుర్యం పొందిన జర్నల్. వివిధ దేశాల్లోని మెడికల్ రంగంలో జరుగుతున్న డెవలప్మెంట్లు, కొత్త వైద్య విధానాలు, లోపాలు, పరిష్కారాలను లాన్సెట్ జర్నల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. ఇపుడా జర్నల్ తాజా సంచకిలో భారత్ లో పెరిగిపోతున్న కరోన సంక్షోభంపై తీవ్రస్ధాయిలో స్పందించింది.

కరోనా వైరస్ కట్టడి కోసం పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ ను ఈ ఏడాది ఏప్రిల్ నెలవరకు నరేంద్రమోడి అసలు సమావేశపరచలేదని స్పష్టంగా చెప్పింది. ప్రపంచంలోని కొన్నిదేశాల్లో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత బయటపడినా భారత్ లో ముందస్తుజాగ్రత్తలు తీసుకోవటంలో మోడి విఫలమయ్యారంటు విరుచుకుపడింది. ఈ సంక్షోభాన్ని నియంత్రించాలంటే కరోనా టీకాలు వేయటాన్ని పెంచటంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ఒకటే మార్గంగా చెప్పింది.

ఇలాంటి సంక్షోభ సమయంలో తనపైన, కేంద్రంపైన వస్తున్న విమర్శలను నియంత్రించటంపైనే మోడి దృష్టి పెట్టిన విషయాన్ని జర్నల్ ఎత్తిచూపింది. ఆగష్టునాటికి దేశంలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని ఇనిస్టుట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనాను కూడా జర్నల్ ప్రస్తావించింది. ఒకవేళ అలాంటి విపత్తు తలెత్తితే అందుకు మోడి మాత్రమే బాధ్యుడవుతారంటు జర్నల్ స్పష్టంగా చెప్పింది.

కరోనా వైరస్ కారణంగా ఆక్సిజన్ లేక రోగులు పడుతున్న అవస్తలు, ఆసుపత్రుల్లో బెడ్లులేని వైనాన్ని, బెడ్లు దొరికినా అందని వైద్య సాయాన్ని జర్నల్ ఎత్తిచూపింది. దేశంలోని రోగులు పడుతున్న బాధలను సవివరంగా వివరించింది. వైరస్ సెకెండ్ వేవ్ ఇంతలా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఐదురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలేనని కూడా జర్నల్ స్పష్టంగా చెప్పింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి నిర్వహించిన ర్యాలీలు, బహిరంగసభలు, రోడ్డుషోల కారణంగా కరోనా తీవ్రత బాగా పెరిగిపోయిందని తేల్చేసింది.

ఎప్పుడైతే ప్రధానమంత్రి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నారో మిగిలిన పార్టీలు నేతలు కూడా అదే మార్గాన్ని అనుసరించిన కారణంగానే దేశంలో సెకెండ్ వేవ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని జర్నల్ అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియ కారణంగానే వేలు, లక్షలాదిమంది జనాలు ఒకేచోట నెలల తరబడి గుమిగూడినట్లు జర్నల్ ప్రస్తావించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కేంద్రం సరైన ప్రణాళికను అనుసరించటం లేదని దుయ్యబట్టింది. టీకాలు వేయటంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపింది. సరే మొన్ననేమో అంతర్జాతీయ మీడియా మోడిని వాయించేస్తే తాజాగా లాన్సెట్ జర్నల్ కూడా అదే దారిలో మోడిని తప్పుపట్టడం గమనార్హం.