అంత దెబ్బ కొట్టిన సినిమాకు సీక్వెల్

మాయవన్ అని తమిళ సినిమా. మన యువ కథానాయకుడు సందీప్ కిషన్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. చాలా కొత్తగా ఉండే కాన్సెప్ట్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు సి.వి.కుమార్. తమిళంలో ‘పిజ్జా’, ‘సూదు కవ్వుం’, ‘ఇరుదు సుట్రు’ సహా ఎన్నో విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్న సి.వి.కుమార్.. ఈ చిత్రంతోనే దర్శకుడిగా మారాడు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమాను తీర్చిదిద్దాడు.

సినిమాకు మంచి టాకే వచ్చింది కానీ.. అనుకున్నంతగా ఆడలేదు. మేకింగ్‌లో ఆలస్యం కావడం, రాంగ్ టైమింగ్‌‌లో రిలీజ్ కావడం ప్రతికూలమయ్యాయి. చివరికి ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. సి.వి.కుమార్ లాంటి మంచి టేస్టున్న నిర్మాత అన్యాయం అయిపోయాడు. ఈ సినిమా కొట్టిన దెబ్బతో అతను కోలుకోలేక ప్రొడక్షన్ ఆపేశాడు. ఓ సినీ వేడుకలో ఈ సినిమా వల్ల తాను ఎంతగా దెబ్బ తిన్నదీ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా.

ఐతే రెండేళ్లకు పైగా విరామం తర్వాత కొంచెం కోలుకుని రెండు మూడు చిన్న సినిమాలు తీశాడు. మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడతను మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తన కెరీర్‌ను గట్టి దెబ్బ తీసిన ‘మాయవన్’కు సీక్వెల్ తీసే సాహసం చేయబోతున్నాడు సి.వి.కుమార్. శుక్రవారం సందీప్ కిషన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘మాయవన్: రీలోడెడ్’ సినిమాను ప్రకటించాడు కుమార్. ఈ చిత్రం తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతుందని వెల్లడించాడు కుమార్.

అప్పుడు ‘మాయవన్’తో అంత దెబ్బ తిన్నాక మళ్లీ దానికి కుమార్ సీక్వెల్ చేసే సాహసం చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే కుమార్ కెరీర్ ఆద్యంతం ఇలాంటి సాహసాలే చేశాడు కాబట్టి ఈసారి అతను సక్సెస్ అవుతాడనే భావిస్తున్నారు. ‘మాయవన్’ సినిమా థియేటర్లలో బాగా ఆడకపోయినా తర్వాత కల్ట్ స్టేటస్ అందుకుంది. టీవీల్లో, ఓటీటీల్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తెలుగులో అనువాదమై ఇక్కడా మంచి స్పందనే రాబట్టుకుంది. దీని సీక్వెల్ కమర్షియల్‌‌గా మంచి ఫలితాన్నందుకుని సందీప్‌కు, కుమార్‌కు సంతోషాన్నిస్తుందని ఆశిద్దాం.