ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

జువారి సిమెంట్స్ ప్లాంట్ మూసివేత వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టు పెద్ద షాకేఇచ్చింది. వాతావరణ కాలుష్యానికి కారణం అవుతోందని కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో ఉన్న జువారి సిమెంట్ ప్లాంటును ప్రభుత్వం వారంరోజుల క్రింద మూయించేసిన విషయం తెలిసిందే. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలకు వ్యతిరేకంగా ప్లాంట్ యాజమాన్యం హైకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ వివరాలను పరిశీలించిన కోర్టు మూసివేత నిర్ణయం చెల్లదంటూ స్పష్టంచేసింది.

వాతావరణ కాలుష్యం నియంత్రణకు తమ ప్లాంటు ఇఫ్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు యాజమాన్యం చెప్పింది. మరిన్ని చర్యలు తీసుకోవటానికి కూడా తమ ప్లాంటు రెడీగా ఉందని చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని యాజమాన్యం తన పిటీషన్లో స్పష్టంచేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునేందుకు కంపెనీకి అవకాశం ఇవ్వకుండా ప్లాంటును ఏకంగా మూసేయటం ఏమిటని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.

కంపెనీకి ప్రభుత్వం చర్యలు తీసుకన్న కారణంగా ప్లాంటులో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇదే సమయంలో ఏడాదికి 13 వేల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంటు మూతపడింది. నిజానికి వాతావరణ కాలుష్య నియంత్రణకు ప్లాంటుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సింది. కరోనా వైరస్ నేపధ్యంలో వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించిన ఫ్యాక్టరీని మూయించేయటం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.