మహేష్-త్రివిక్రమ్.. అప్పుడే టైటిల్ వరకు వెళ్లారా?

నెల ముందు వరకు త్రివిక్రమ్ తర్వాతి సినిమా.. జూనియర్ ఎన్టీఆర్‌తోనే అనుకుంటూ వచ్చారు అందరూ. ‘జెర్సీ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన నిర్మాత నాగవంశీ.. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయింది. ఎన్టీఆరేమో కొరటాల శివతో సినిమాను అనౌన్స్ చేశాడు. కొంచెం గ్యాప్ ఇచ్చి త్రివిక్రమ్.. మహేష్ సినిమా గురించి ప్రకటించాడు. అసలు ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివ.. ఎన్టీఆర్ కోసం ఇంకా కథ రెడీ చేయలేదనే అంటున్నారు.

అలాగే మహేష్ సినిమాకు త్రివిక్రమ్ కూడా స్క్రిప్టు పూర్తి చేయలేదనే అంటున్నారు. ఈ నెల 31న కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాకు ప్రారంభోత్సవం జరపనున్నట్లు చెబుతున్నారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి మాత్రం కొంచెం సమయం పట్టేట్లే ఉంది. ఎందుకంటే ఇంకా ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ కాలేదన్న చిత్ర వర్గాల సమాచారం. ఐతే మీడియాలో మాత్రం అప్పుడే ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ ఖరారైపోయినట్లుగా చెబుతుండటం విశేషం.

పార్థు అనగానే మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’ మహేష్ పాత్ర గుర్తుకొస్తుంది. ఆ సినిమాతో పార్థు అనే పేరుకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు వీరి కలయికలో సినిమా అనేసరికి సరదాగా ఈ టైటిల్‌ను ప్రచారంలోకి తెస్తున్నారో ఏమో తెలియదు. త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే సమయానికి టైటిల్ ఖరారు చేయడం అరుదు. సగం చిత్రీకరణ అయ్యాక నెమ్మదిగా టైటిల్ అనౌన్స్ చేస్తుంటాడు. అలాంటిది ఇంకా స్క్రిప్టు రెడీ కాని, మొదలుకాని సినిమాకు ఇప్పుడే టైటిల్ పెట్టేసి మీడియాకు లీక్ చేస్తాడా అన్నది డౌటు.