ప‌న‌బాక సైకిల్ దిగేస్తున్నారే.. రీజన్ ఇదేనా ?

ప‌న‌బాక ల‌క్ష్మి. కేంద్ర మాజీ మంత్రి, ఇటీవ‌ల తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నాయ‌కురాలు. నిజానికి గ‌త 2019 ఎన్నిక‌ల్లోనూ ఆమె టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. అప్ప‌టి ఇప్ప‌టికి కూడా ఆమె ఓటు బ్యాంకు భారీగా త‌గ్గిపోయింది. ఇటు ఓట‌మి భారం ఒక‌టైతే.. మ‌రోవైపు.. ఓటు బ్యాంకు ప‌డిపోవ‌డం, ఘోరంగా ఓడిపోవ‌డం ఆమెను మ‌రింత కుంగ‌దీస్తోంది. అయితే.. ఈ ప‌రిణామాల‌తో ఆమె చాలా తీవ్ర మాన‌సిక ఆవేద‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో త‌ను ఒంట‌రిగా ప్ర‌చారం చేసుకున్నప్పుడు ఓటు బ్యాంకు బాగానే వ‌చ్చినా.. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర నాయ‌క‌త్వం అంతా ఇక్క‌డే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేసినా ఇంత ఘోర ఓట‌మి ఎందుకు ఎదురైంద‌నేదే కీల‌క ప్ర‌శ్న‌.

నిజానికి ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ వారాల త‌ర‌బ‌డి తిరుప‌తిలోనే తిష్ట‌వేసి.. ప్ర‌చారం చేశారు. ఏడు పార్ల‌మెంటు నియోజ‌వ‌క‌ర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. దీంతో తాను ఖ‌చ్చితంగా గ‌ట్టి పోటీ ఇస్తాన‌ని ప‌న‌బాక భావించారు. గ‌ట్టి పోటీ సంగ‌తి అటుంచితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఇక‌, ఈ ఓట‌మిపై నేత‌లు ఎక్క‌డా అంత‌ర్మ‌థ‌నం చేయ‌లేక పోగా.. ప్ర‌చారం ముగిసిన వెంట‌నే ఎవ‌రింటికి వారు వెళ్లిపోయారు. ఈ ప‌రిణామాల‌పై దృష్టి పెట్టిన ప‌న‌బాక ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం.

అంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌చారం .. త‌న కోసం కాద‌ని.. పార్టి అధినేత‌, ఆయ‌న కుమారుడు త‌మ ప్ర‌భావం నిల‌బెట్టుకునేందుకు.. త‌మ ప‌ట్టు పెంచుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నంగా ప‌న‌బాక శిబిరం భావిస్తోంది. ఇక ఆర్థికంగా కూడా ముందు చంద్ర‌బాబు ఇచ్చినంత భ‌రోసా పోలింగ్‌కు ముందు ఇవ్వ‌లేదు. ముందుగా చంద్ర‌బాబు ప‌న‌బాక పేరు ప్ర‌క‌టించినా ఆ త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డంతో ఆమె తిరుప‌తిలో పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు. చివ‌ర‌కు బాబు & కో బ‌తిమిలాడుకుని మ‌రీ ఆమెను పోటీకి ఒప్పించారు. ఆమె అయిష్టంగానే తిరుప‌తిలో పోటీ చేశారు.

ఇప్పుడు పార్టీ ఘోరంగా దెబ్బ‌తిన‌డంతో పాటు అనేకానేక ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె పార్టీలో ఉండ‌డం క‌న్నా.. త‌న దారి తాను చూసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. అయితే.. వైసీపీ, లేక‌పోతే.. బీజేపీలో కి వెళ్లినా.. గౌర‌వ‌ప్ర‌దంగా ఉంటుంద‌ని ప‌న‌బాక కుటుంబం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వైసీపీలోకి వెళ్తే.. క‌నీసం ఎమ్మెల్సీ అయినా ద‌క్కుతుంద‌ని, బీజేపీలోకి వెళ్తే.. పార్టీలో అయినా గుర్తింపు ఉంటుంద‌ని అనుకుంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించింది. అయితే.. అప్ప‌ట్లో కాద‌ని ప‌న‌బాక‌.. చంద్ర‌బాబుకు జై కొట్టారు. అయితే.. మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె సైకిల్ దిగిపోవ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లే నెల్లూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. మ‌రి ప‌న‌బాక ఏం చేస్తారో ? చూడాలి.