ఐపీఎల్ వాయిదా.. బీసీసీఐకి ఎంత నష్టం?

అనివార్య పరిస్థితుల్లో ఐపీఎల్‌ను వాయిదా వేసేసింది బీసీసీఐ. ఏటా ఈ లీగ్ ద్వారా బీసీసీఐ ఐదారు వేల కోట్ల దాకా ఆదాయం ఆర్జిస్తుంది. అందుకే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే.. లీగ్‌ను నిర్వహించడానికే చూస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా వేసవిలో టోర్నీ నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే.. ఆరు నెలలు వేచి చూసి, యూఏఈ వేదికగా లీగ్‌ను నిర్వహించారు. విదేశంలో, ప్రేక్షకులు లేకుండా లీగ్ జరిపించడం వల్ల ఆదాయంలో కొంత కోత పడ్డప్పటికీ.. భారీగానే ఆదాయం వచ్చింది.

ఐతే ఈసారి ఇండియాలో పరిస్థితులు మెరుగు పడటం, ఇంగ్లాండ్‌తో అంతర్జాతీయ సిరీస్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వడంతో మళ్లీ దేశం దాటి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. సొంతగడ్డ మీద షెడ్యూల్ ప్రకారమే లీగ్‌ జరిపించడానికి సన్నాహాలు చేశారు. కాకపోతే వేదికల సంఖ్యను తగ్గించారు. స్టేడియాల్లోకి అభిమానులకు అనుమతిని నిషేధించారు.

ఎంత పకడ్బందీగా చేద్దామని చూసినా సరే.. లీగ్ మధ్యలో ఉండగా కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో అర్ధంతరంగా టోర్నీని ఆపేయక తప్పలేదు. దీని వల్ల తక్షణం బీసీసీఐ ఆదాయానికి రూ.2 వేల కోట్లకు పైగానే కోత పడ్డట్లు తెలుస్తోంది. ఓ బీసీసీఐ అధికారి నష్టంపై మాట్లాడుతూ.. రూ.2200 కోట్ల నుంచి రూ.2500 కోట్ల దాకా ఉండొచ్చని పేర్కొన్నాడు. ఐతే మొత్తంగా ఈ మేరకు ఆదాయం కోల్పోయినట్లేనా అన్నది ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ఎందుకంటే ప్రస్తుతం లీగ్‌ను ఆపేయడం వల్ల మిగతా మ్యాచ్‌ల ద్వారా రావాల్సిన ఆదాయానికి తాత్కాలికంగా గండి పడ్డట్లే. తర్వాత వీలు చిక్కినప్పుడు లీగ్‌లో మిగతా మ్యాచ్‌లు జరిపిస్తే ఆదాయం రాకుండా పోదు. కానీ ఇప్పుడు లీగ్‌ను మధ్యలో ఆపి.. మళ్లీ విండో దొరికినపుడు కొత్తగా లీగ్‌ను జరిపించడం వల్ల కొన్ని వందల కోట్లలో అయితే బీసీసీఐకి నష్టం తప్పదు అన్నట్లే. పైగా మళ్లీ ఖాళీ దొరకబుచ్చుకుని, అన్ని బోర్డులతో మాట్లాడి, కొత్తగా బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహించడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు.