సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోయిన మోడీ.. ఏం జ‌రిగిందంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప్ర‌భ మ‌స‌క బారుతోంద‌నేందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. మ‌రొక‌టి చోటు చేసుకుంది. బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. మోడీపై అనేక విమ‌ర్శ లు వ‌చ్చాయి. అయితే.. దానిపై నోరు మెద‌ప‌ని .. బీజేపీ నాయ‌కుల‌కు ఇప్పుడు మ‌రో పెద్ద షాక్ త‌గిలింది. ఏకంగా ప్ర‌ధాని మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యూపీలోని వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోను, అదే సమయంలో బీజేపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అయోధ్య‌లోనూ.. ఆ పార్టీకి ఎదురు గాలి జోరు గా వీచింది.

ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా చ‌తికిల‌ప‌డింది. ఇక్క‌డ ప్ర‌తిప‌క్షం, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పీ) సత్తా చాటుకుంది. మోడీ సొంత నియోజ‌క‌వ‌ర్గం వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 15 సీట్లలో ఎస్‌పీ గెలుపొందింది. బీజేపీ కేవలం 8 సీట్లు సాధించింది. ఇక‌, అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. వాస్త‌వానికి ఇక్క‌డ రామమందిరానికి ప్ర‌ధాని మోడీ.. స్వ‌యంగా శంకుస్తాప‌న చేశారు. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉంటార‌ని అనుకున్నారు. కానీ, బెడిసి కొట్టింది. ఇక్క‌డ‌ తక్కిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు.

కాగా, ఈ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రతినిధి ఒకరు ఆచితూచి వ్యాఖ్యానించారు. పార్టీకి ఊహించని ఫలితాలు రావడానికి కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీ క్యాడర్‌ ఆగ్రహంతో ఉండటం, తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య కూడా పార్టీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపించినట్టు పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు చాలాకాలంగా సమస్యలు వినిపిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, తాజా ఫలితాలు ఒక హెచ్చరిక సంకేతమని ఆయన అన్నారు.

ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఉంది. ఇచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రాజ‌యం ఆ పార్టీని తీవ్ర‌స్థాయిలో ఇబ్బందిలోకి నెట్టేసిందనేది నిజం. పార్టీ కార్యకర్తలతో మంత్రులు మమేకం కాక‌పోవ‌డం, నేతలు, కార్యకర్తల మధ్య ఏర్పడిన అగాధం, మోడీ హ‌వా త‌మ‌ను నిల‌బెడుతుంద‌న్న అతి విశ్వాసం.. వంటివి.. అటు బీజేపీని, ఇటు మోడీని కూడా బద్నాం చేస్తున్నాయ‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు.