ఐపీఎల్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

మొత్తానికి రెండు రోజుల వ్యవధిలో కథ మొత్తం మారిపోయింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ ఉన్నట్లుండి ఆగిపోయింది. లీగ్‌లో భాగమైన మూడు జట్లలో కరోనా కేసులు వెలుగు చూడటంతో 14వ సీజన్‌ను అర్ధంతరంగా ఆపేశారు. మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేశారు.

ముందు లీగ్ ఆగింది, వాయిదా వేశారు అంటే.. కొన్ని రోజులు వేచి చూసి పరిస్థితులు సర్దుకున్నాక మ్యాచ్‌లను నిర్వహిస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. టోర్నీని ప్రస్తుతానికి రద్దు చేసేస్తున్నారని.. ఇప్పట్లో మ్యాచులు ఉండవని స్పష్టమైంది. విదేశీ ఆటగాళ్లు వారి కుటుంబాలను కలిసేందుకు, వారి స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో పేర్కొనడంతో ప్రస్తుతానికి టోర్నీ ఆగిపోయిందని.. కొన్ని నెలల తర్వాత వీలు చూసుకుని మ్యాచ్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేయబోతున్నారని స్పష్టమైంది.

మరి మధ్యలో ఆగిన ఐపీఎల్ 14వ సీజన్ తిరిగి ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచి వేస్తోంది. భారత్‌తో పాటు వివిధ దేశాల క్రికెటర్లకు వీలు దొరికే తేదీలు చూసి లీగ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం మూడు వారాల వ్యవధి కావాలి. వచ్చే నెల మధ్యలో భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లబోతోంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో దాని సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ మధ్యలో కొంచెం ప్రయత్నిస్తే లీగ్‌ రెండో సగాన్ని షెడ్యూల్ చేయొచ్చు. ఇంత త్వరగా ఆటగాళ్లను మళ్లీ రీగ్రూప్ చేయాలంటే కొంచెం కష్టం కావచ్చు.

అలా కాని పక్షంలో భారత జట్టు.. ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడటానికి ముందు కొన్ని రోజులు ఖాళీ దొరుకుతుంది. అప్పుడు లీగ్‌ను ప్లాన్ చేయొచ్చు. మిగతా దేశాల షెడ్యూళ్లను కూడా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అది మిస్సయితే అక్టోబరు, నవంబరు నెలల్లో టీ20 ప్రపంచకప్‌తో అందరూ బిజీ అయిపోతారు. మళ్లీ డిసెంబరులో కానీ వీలు దొరకదు. ఐతే లీగ్‌ను ఎప్పుడు నిర్వహించినప్పటికీ.. సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లో, ఎక్కువగా రోజుకు రెండు మ్యాచ్‌లు నిర్వహించి అయినా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.