వాళ్లిద్దరి పెళ్లి మళ్లీ వాయిదా

బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్-ఆలియా భట్‌ల పెళ్లికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం తప్పట్లేదు. మూడేళ్ల ముందే వీరి పెళ్లి జరగాల్సింది. కానీ రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడటంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆయన కోలుకుని మామూలు మనిషయ్యాక వీరి పెళ్లి చేద్దామనుకున్నారు. రిషి విదేశాల్లో చికిత్స చేయించుకుని ముంబయికి తిరిగొచ్చారు.

ఆయన కొంచెం కుదురుకున్నాక పెళ్లి అనుకున్నారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. లాక్ డౌన్ టైంలో రిషి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు. దీంతో రణబీర్-ఆలియాల పెళ్లి గురించి వెంటనే ఆలోచించలేని పరిస్థితి తలెత్తింది. కరోనా కష్టాలు తొలగిపోయి.. రణబీర్, ఆలియా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఈ ఏడాది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ మళ్లీ వీరి ప్రణాళికలను దెబ్బ తీసింది.

రణబీర్, ఆలియా ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడ్డారు. ముంబయిలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ ఆంక్షలు, కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారేలా లేవు. రాబోయే కొన్ని నెలల్లో రణబీర్, ఆలియాల పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ అనిశ్చితిలో పెళ్లి వద్దని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. పరిస్థితులు పూర్తిగా మెరుగు పడ్డాకే వివాహం అనుకుంటున్నారట.

అందుకే పెళ్లిని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2022లో కానీ రణబీర్-ఆలియా పెళ్లి జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇద్దరూ కరోనా నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆలియా చేతిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు గంగూబాయి కతియావాడీ, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలున్నాయి. ఇందులో ‘బ్రహ్మాస్త్ర’ రణబీర్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడం విశేషం. చేతిలో ఉన్న కమిట్మెంట్లను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది కరోనా ప్రభావం తగ్గాక ప్రశాంతంగా పెళ్లి చేసుకుందామని రణబీర్, ఆలియా ఫిక్సయినట్లు తెలస్తోంది.