సంపూర్ణ ఆధిక్యత సాధించిన వైసీపీ

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ సంపూర్ణ ఆధిక్యత సాధించింది. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను వైసీపీకి మంచి మెజారిటిలే వచ్చాయి. 2019 ఎన్నికలో మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటి సాధించినా తిరుపతి అసెంబ్లీలో మైనస్ ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది ఏడుకు ఏడు అసెంబ్లీల్లోను కంఫర్టబుల్ మెజారిటి సాధించిన కారణంగానే వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి రికార్డుస్ధాయిలో 2.71 లక్షల ఓట్ల మెజారిటి వచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే తాజా ఎన్నికల్లో వైసీపీకి మెజారిటి తో పాటు ఓట్లశాతం కూడా పెరిగింది. ఇదే సమయంలో టీడీపీకి ఓట్లూ తగ్గాయి, ఓట్లశాతం కూడా తగ్గింది. అప్పట్లో అంటే 2019లో పోలైన సుమారు 14 లక్షల ఓట్లలో వైసీపీకి 7.28 లక్షల ఓట్లువచ్చాయి. అలాగే 54.91 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇపుడు పోలైన 11 లక్షల ఓట్లలో వైసీపీకి వచ్చింది 6.26 లక్షల ఓట్లు. అలాగే 56.67 శాతం ఓట్లొచ్చాయి. అంటే సుమారు 1.8 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి.

ఇక టీడీపీ విషయం చూస్తే అప్పటి ఎన్నికల్లో 37.56 శాతం ఓట్లతో 4.94 లక్షల ఓట్లు సాధించింది. తాజా ఎన్నికల్లో 32.09 శాతం ఓట్లతో 3.54 లక్షల ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. అంటే టీడీపీకి ఏకంగా 5.4 శాతం ఓట్లు తగ్గిపోయింది. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబునాయుడు మాత్రం వైసీపీకి ఓట్లు తగ్గిపోయాయని ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది. పోలైన ఓట్లు తగ్గిపోయాయి కాబట్టే పార్టీలకు వచ్చిన ఓటు షేర్ కూడా తగ్గిందన్నది వాస్తవం.

వైసీపీ పెట్టుకున్న 5 లక్షల ఓట్ల మెజారిటి టార్గెట్ దక్కలేదు కాబట్టి ప్రజలు అధికారపార్టీకి గుణపాఠం చెప్పారని, ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత బయటపడిందనే పిచ్చిలెక్కలతో చంకలు గుద్దుకుంటున్నారు. రెండు ఎన్నికల్లోను పోలైన ఓట్లతో పోల్చుకుంటే తాజాగా వైసీపీకి ఓట్లూ పెరిగాయి, ఓట్ల శాతమూ పెరిగిందన్నది వాస్తవం. ఇదే సమయంలో టీడీపీకి ఓట్లు+ఓట్లశాతం గణనీయంగా తగ్గిపోయాయి. ఈ కారణంగానే వైసీపీ అభ్యర్ధికి రికార్డుస్ధాయి మెజారిటి సాధ్యమైంది.

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎవరికీ దక్కనంత మెజారిటి ఇపుడు వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి దక్కిందన్నది వాస్తవం. అప్పుడెప్పుడో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన డాక్టర్ చింతామోహన్ కు వచ్చిన 1.88 లక్షల మెజారిటియే రికార్డుగా ఉండేది. దాన్ని గురుమూర్తి ఇపుడు బద్దలు కొట్టారు. 2019లో జరిగినట్లు 80 శాతం పోలింగ్ జరిగుంటే వైసీపీకి 5 లక్షల మెజారిటి వచ్చుండేదేమో.