బీజేపీ అతే జనాలకు నచ్చలేదా ?

క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి పశ్చిమబెంగాల్లో మమతబెనర్జీ పై బీజేపీ నుండి చాలా మంది పదే పదే దాడులు చేశారు. నరేంద్రమోడి నాయకత్వంలో అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపిలు ఇలా అనేకమంది ఒకటికి పదిసార్లు పదే పదే మమతపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతునే ఉన్నారు.

మమతపై దాడులతో విరుచుకుపడిన మోడి అండ్ కో మరచిపోయిందేమంటే దీదీని తాము వ్యక్తిగతంగా కించపరిస్తున్నామని. పాలసీలు, అభివృద్ధిపై మాట్లాడాల్సిన మోడి కూడా మమత వ్యక్తిత్వాన్నే టార్గెట్ చేశారు. మోడి అండ్ కో ఒకవైపు మమత ఒక్కరు ఒకవైపు నిలబడ్డారు. దాంతో మమతపై జనాల్లో సింపతి పెరిగిపోయింది. పైగా ఈ ఎన్నికల్లో లోకల్-నాన్ లోకల్ అనే ఫీలింగ్ కూడా విపరీతంగా వచ్చేసింది.

ఇదే సమయంలో మమతను మోడి అండ్ కో కాలేజీలో చేసినట్లుగా ర్యాంగింగ్ చేయటాన్ని జనాలు ఇష్టపడలేదు. మమతను బేగం అంటు పదే పదే ఎద్దేవా చేశారు. మమత గెలిస్తే రాష్ట్రంలో ముస్లిం పెత్తనం పెరిగిపోతుందని వ్యూహాత్మకంగా బురదచల్లారు. మెజారిటి హిందువులను మమతకు దూరం చేయటానికి బీజేపీ నేతలు చాలా ప్రయత్నాలే చేసింది. అయితే బెంగాలీ అయిన మమత పనితీరు, వ్యక్తిత్వం, ప్రధానమంత్రిగా మోడి పాలనా తీరు, వ్యక్తిత్వాన్ని జనాలు బేరీజు వేసుకున్నారట.

దీనికితోడు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను అరికట్టడంలో మోడి విఫలమవ్వటం, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బెంగాల్ అంతా పర్యటించి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేయటం కూడా మమతకు కలిసొచ్చింది. ఇలాంటి అనేక కారణాలతో మమతకు వ్యతిరేకంగా మోడి బ్యాచ్ చాలా అతిచేసినట్లుగా జనాలు అనుకున్నట్లున్నారు. అందుకనే ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులను 221 సీట్లలో గెలిపించారు. కాకపోతే ఈ మొత్తంలో నందిగ్రామ్ లో మమత ఓడిపోవటమే బాధాకరం.