పీకే జోస్యం నిజమైంది.. ఆయన చెప్పిందే జరిగిందిగా?

ఎన్నికల వ్యూహకర్త అన్న పదానికి సరికొత్త ఇమేజ్ తీసుకురావటమే కాదు.. తాను అందించే సేవల కోసం కొమ్ములు తిరిగిన రాజకీయ అధినేతలు సైతం వెయిట్ చేసే సత్తా ఆయన సొంతం. మాటల్లో మాత్రమే కాదు చేతల్లోనూ చేసి చూపిస్తానన్న విషయాన్ని పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రూవ్ చేశారు. తన నోటి నుంచి ఏదైనా మాట వచ్చినా.. సవాలు విసిరినా.. గురి తప్పని రీతిలో లక్ష్యాన్ని చేధించే మేజిక్ ను ఆయన బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి ప్రదర్శించారు.

పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో బీజేపీ ఎంతలా ప్రయత్నించినా.. ఆ పార్టీ రెండు అంకెల స్థానాలకు మించి సాధించలేదన్నారు. అంతేకాదు.. వంద సీట్ల కంటే ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంటే.. తాను ట్విటర్ నుంచి శాశ్వితంగా వీడుతానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను చెప్పింది చెప్పినట్లు జరిగిన దానికి భిన్నంగా.. పశ్చిమ బెంగాల్ తీర్పుభిన్నంగా వస్తుందని.. పీకేకు ఎదురుదెబ్బ తప్పదన్న మాట బలంగా వినిపించింది. అయినప్పటికి ఆయన అలాంటి వ్యాఖ్యలకు స్పందించలేదు. తాను గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటానని చెప్పారు.

ఆయన చెప్పినట్లే తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడటం.. అధికారానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు చచ్చి చెడీ అనే రీతిలో వస్తుందన్న పరిశీలకుల అంచనాకు భిన్నంగా.. ఎవరూ ఊహించని రీతిలో సీట్లను డబుల్ సెంచురీ దాటించేసిన మమత.. తన మేజిక్ ను ప్రదర్శించారు.

బెంగాల్ ఎన్నికల అనంతరం ఎగిరేది కాషాయ జెండా అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసిన బీజేపీకి బెంగాలీ ఓటర్లు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు. ఆ పార్టీ కేవలం 83 స్థానాల్లోనే తన సత్తా చాటింది (ఇప్పటివరకువెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే.. నాలుగుస్థానాల్లో గెలుపు.. 79 స్థానాల్లో అధిక్యతలో ఉంది) తుది ఫలితం మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గత డిసెంబరులో పీకే చేసిన సవాలుకు తగ్గట్లే తాజా ఫలితం ఉండటంతో.. ప్రశాంత్ కిశోర్ ఛరిష్మా మరింతలా పెరిగిపోతుందన్న మాట వినిపిస్తోంది.