రికార్డు దిశగా మమత దీదీ

అందరి అంచనాలను పటాపంచలు చేస్తు పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. చివరి వార్తలు అందేటప్పటికి టీఎంసీ 202 సీట్లలో మెజారటితో దూసుకుపోతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్న దూకుడుతో రాజకీయాలు, ప్రచారం చేసిన బీజేపీ 88 సీట్ల మెజారిటిలో ఉంది. బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలుకాకముందే ఎలాగైనా మమతను ఓడించి బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా ద్వయం చాలా కష్టపడ్డారు.

అయితే వాళ్ళ కష్టం వికటించింది. మమతను మానసికంగా దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో అనకూడని మాటలు, చేయకూడని వ్యాఖ్యలు చేశారు. దాంతో మోడి, అమిత్ రాజకీయాన్ని జనాలు ఆమోదించలేదు. మమతను మోడి, అమిత్ ఇద్దరు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. వీళ్ళిద్దరే కాకుండా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా+కేంద్రమంత్రులు చాలామంది బెంగాల్లో ప్రచారంతో హోరెత్తించారు. ఎవరెంత చేసినా చివరకు ఉపయోగమైతే కనబడలేదు.

2016లో సాధించిన 211 సీట్ల మార్కును కూడా ఇపుడు తృణమూల్ దాటుతుందా అని అనిపిస్తోంది. పైగా తృణమూల్ కు మెజారిటి సీట్లు పెరిగేకొద్దీ వ్యక్తిగతంగా నందిగ్రామ్ లో కూడా పుంజుకుంటున్నారు. నందిగ్రామ్ లో మొదటి నాలుగురౌండ్లలో బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి 10 వేల మెజారిటితో ఉన్నారు. దాంతో మమత ఓటమి ఖాయమేనా అన్నట్లుగా మీడియా హెరెత్తించేసింది.

అయితే ఐదో రౌండు మొదలయ్యేసరికి మమత కూడా బాగా పుంజుకున్నారు. సుబేందు మెజారిటి 10 వేల నుండి 3 వేలకు తగ్గిపోయింది. ఇలానే మరో రెండు రౌండ్లు మమతకు లీడ్ వస్తే బీజేపీ వెనకబడే అవకాశాలున్నాయి. మొత్తంమీద సర్వేల్లో కానీ ఎగ్జిట్ పోల్స్ లో కానీ ఎవరూ ఊహించనివిధంగా మమత హవా కంటిన్యు అవుతోంది. గ్రాండ్ విక్టరీతో మమత హ్యాట్రిక్ సీఎం అనిపించుకోవటం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది.

2016లో కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ తాజా ఎన్నికల్లో రెండంకెల స్కోరు దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తోంది. టీఎంసీకి ఇప్పటికే 48 శాతం ఓట్లు సాధిస్తే బీజేపీ 37 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ బెంగాల్లో గెలవకపోయినా గణనీయంగా ఓట్లు, సీట్లు పెంచుకోవటం గమనార్హం. ఏదేమైనా మమతపై మోడి, అమిత్ షా ప్లేచేసిన మైండ్ గేమ్ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం స్పష్టమైపోయింది.