ఆ క్రికెటర్ ఇంట్లో పది మందికి పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. సామాన్యులు.. సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లోని వారంతా కరోనా పాజిటివ్ కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లోని వారందరికి కరోనాగా తేలటం గమనార్హం. ఈ విషయాన్ని అశ్విన్ సతీమణి పృథ్వీ నారాయణన్‌ స్వయంగా వెల్లడించారు.

తాజాగా ట్వీట్ చేసిన ఆమె.. తాము శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. గత వారమే అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగటం తెలిసిందే. తన వారిని రక్షించుకోవటం కోసం తాను టోర్నీ నుంచి తొలిగినట్లుగా చెప్పారు. ఐపీఎల్ నుంచి వైదొలిగిన తొలి భారత క్రికెటర్ అశ్విన్ కావటం గమనార్హం. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారు.. నలుగురు పిల్లలకు పాజిటివ్ అని తేలటంతో.. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో.. ఆసుపత్రుల్లో చేరారు.

దీనిపై స్పందించిన అశ్విన్ సతీమణి.. వారమంతా ఒక పీడకలలా గడిచిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. టీకా వేసుకోవాలని ఆమె కోరారు. సగటుజీవితో పోలిస్తే.. ఒక ప్రముఖ క్రికెటర్ ఇంట్లో కరోనాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సదరు క్రికెటర్ ఇంట్లోని వారందరికి పాజిటివ్ గా తేలిన వైనం చూస్తే.. కరోనా విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం అశ్విన్ అనుభవం చెబుతుందని చెప్పాలి.