ఇది.. మోడీ పెట్టిన మంటే: క‌న్నీరు పెట్టిస్తున్న ‘TIME’ క‌థ‌నం!

“అది భార‌త దేశ రాజ‌ధాని ఢిల్లీలోని స‌బ‌ర్బ్ ప్రాంతం. సూర్యుడు నెమ్మ‌దిగా అస్త‌మిస్తున్నాడు. సంధ్యా స‌మ‌యం ఆవ‌రిస్తోంది. వాతావ‌ర‌ణంలో మెల్ల‌గా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కానీ, స‌బ‌ర్బ్ హిందూ శ్మ‌శాన వాటిక నుంచి నిరంత‌రాయంగా గాలిలోకి ధూళి లేస్తూనే ఉంది. భ‌గ‌భ‌గ‌మ‌ని మండుతున్న చితుల‌ మంట‌లు.. ఉప్పొంగి భోగి మంట‌లుగా ఎగిసి ప‌డుతూనే ఉన్నాయి. వీటి నుంచి వ‌స్తున్న బూడిద‌, దుర్వాస‌న.. ప‌ర్యావ‌ర‌ణంలో క‌లిసిపోయి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్ల‌క్ష్య‌పు జ్వాల‌ల న‌డుమ క‌రోనా బాధిత నిర్జీవ దేహాల‌ను నుసి చేస్తూ.. దేశ పాల‌క వ్య‌వ‌స్థ‌కు స‌వాల్ రువ్వుతోంది”

ఇదీ.. ప్ర‌పంచ స్థాయిలో పేరెన్నిక‌గ‌న్న‌.. అమెరికాకు చెందిన ‘TIME’ మేగ‌జీన్ రాసిన ముఖ‌చిత్ర క‌థ‌నం ‘India’s COVID-19 Crisis Is Spiraling Out of Control. It Didn’t Have to Be This Way’.. భార‌త దేశంలో క‌రోనా తీవ్ర‌త‌ను, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్ల‌క్ష్యాన్ని.. క‌ళ్ల‌కు క‌ట్టేసింది. విధాన ప‌ర‌మైన లోపాలు.. ‘మేకిన్ ఇండియా’ అనే దుర్బ‌ల‌మైన నినాదాన్ని నిజం చేయాల‌నే ల‌క్ష్యం.. వంటివి మోడీకి ప్ర‌తిబంధ‌కంగా మారి.. దేశ ప్ర‌జ‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారికి ఎర‌వేశాయ‌ని.. ‘TIME’ ముఖ చిత్ర క‌థ‌నం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

నిశిత దృష్టి.. మేధావుల నుంచి అభిప్రాయాలు, క్షేత్ర‌స్థాయి వాస్త‌వాల‌తో ఏప్రిల్ 26-27 తేదీల్లో దేశంలో ఉన్న క‌రోనా ప‌రిస్థితిని.. అంతకు ముందున్న ప‌రిస్థితిని వివ‌రించింది. దీనిలో ప్ర‌ధానంగా త‌గ్గిపోతున్న ద‌శ‌లో ఉన్న క‌రోనాను పాల‌కులు పెంచిపోషించార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ కాగా.. ‘ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌’ నినాదాన్ని నిజం చేసుకునేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన ప్ర‌యోగాలు.. కూడా వైర‌స్‌ను పెంచి పోషించాయ‌ని.. అదేస‌మ‌యంలో రాజ‌కీయ కార‌ణాలు.. ఎన్నిక‌ల వ్యూహాలు.. వంటివి.. దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభించ‌డానికి కార‌ణాలు TIME పేర్కొంది.

అంతేకాదు, TIME.. ముఖ‌చిత్రం కూడా ఢిల్లీలో స‌బ‌ర్బ్‌.. శ్మ‌శాన వాటిలో కాలుతున్న చితులు, ఇంకా త‌మ వ‌రుస రాలేదా? అని ఎద‌రు చూస్తున్న మూటల్లోని శ‌వాలతో కూడిన ఫొటోను ప్ర‌చురించి.. దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌ను TIME ప్ర‌పంచం క‌ళ్ళ‌కు 70MM లో చూపించింది. ప్ర‌స్తుతం TIME క‌థ‌నం.. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ సంపాయించుకున్నాన‌ని చెబుతున్న గౌర‌వం.. చితిమంట‌ల్లో కాలిపోతోంది అంటున్నారు ప‌రిశీల‌కులు.