మమత హ్యాట్రిక్ ఖాయమేనా ?

తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అవుననే అనుకోవాలి. పశ్చిమబెంగాల్లో చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత అనేక సర్వే, మీడియా సంస్ధలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదలచేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆరుసంస్ధల్లో మూడింటి ప్రకారమైతే బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. ఇదే సమయంలో మిగిలిన మూడు సంస్ధల అంచనాల ప్రకారం మమతబెనర్జీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన మూడు మీడియా సంస్ధలు కమలంపార్టీకి మద్దతుగా పనిచేస్తున్నాయనే ప్రచారంలో ఉంది. ఇండియా టుడే-యాక్సిస్ అంచనా ప్రకారం బీజేపీకి 160 సీట్లు వస్తే, మమతకు 156 సీట్లొస్తాయట. రిపబ్లిక్-సీఎన్ఎక్స్ సంస్ధ ప్రకారం బీజేపీకి 148 సీట్లు, టీఎంసీకి 138 సీట్లొస్తాయి. అంటే దాదాపు హంగ్ వస్తుందని చెప్పింది.

ఇక ఇండియా టుడే-పీపుల్స్ పల్స్ ప్రకారం బీజేపీ 192 సీట్లతో మంచి మెజారిటితో గెలవబోతోంది. అలాగే మమత పార్టీకి అతి తక్కువగా 88 సీట్లు మాత్రమే వస్తోంది. ఇక టైమ్స్ నౌ సీఓటర్ అంచనా ప్రకారం మమత పార్టీకి 164 సీట్లు, బీజేపీకి 121 సీట్లు వస్తాయట. అలాగే పీమార్ క్యూ అంచనా ప్రకారం టీఎంసీకి 172 సీట్లు, బీజేపీకి 132 సీట్లొస్తాయి. టుడే చాణుక్య, ఎన్డీటీవీ సంస్ధలు కూడా మమత హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అంచనా వేశాయి.

చివరగా లెఫ్ట్-కాంగ్రెస్ ఫ్రంట్ కు మ్యాగ్జిమమ్ 25 సీట్లు వస్తే అదే చాలా ఎక్కువన్నట్లు అంచనా వేశాయి. బహుశా బెంగాల్లో హంగ్ వస్తే అప్పుడు ఈ ఫ్రంట్ కు ప్రాధాన్యత పెరుగుతుందేమో చూడాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జరిగిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం మొదటి ఏడువిడతల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించింది మాత్రమే. ఎందుకంటే ఎనిమిదవ విడత పోలింగ్ గురువారం సాయంత్రం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ప్రసారం మొదలైపోయిందంటే ఎనిమిదో విడత పోలింగ్ ను పరిగణలోకి తీసుకోలేదని అర్ధమవుతోంది.