టెన్ష‌న్‌లో వైసీపీ.. సైలెంట్‌గా టీడీపీ.. ఇదో చిత్ర‌మైన పాలిటిక్స్ ?‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో తీవ్ర టెన్ష‌న్ నెల‌కొంది. మంత్రులు, నాయ‌కులు కూడా తీవ్ర టెన్ష‌న్‌కు గుర‌వుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మ‌రో నాలుగు రోజుల్లో .. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం రానుంది. వ‌చ్చే నెల 2న తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. దీంతో వైసీపీలో టెన్ష‌న్ క‌నిపిస్తోంది. కానీ, అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ప్పటికీ టీడీపీలో మాత్రం ఈ త‌ర‌హా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు.

దీనికి కార‌ణం ఏంటి? వైసీపీ ఎందుకు టెన్ష‌న్ ప‌డుతోంది? టీడీపీ ఎందుకు సైలెంట్ అయిపోయింది ? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం ఆస‌క్తిగా మారింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో దాదాపు 5 ల‌క్ష‌ల మెజారిటీ సాధించాల‌ని వైసీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌చారాన్నిహోరెత్తించింది. కానీ, ఓటింగ్ జ‌రిగిన స‌ర‌ళి.. న‌మోదైన పోలింగ్ శాతం వంటివి చూసిన త‌ర్వాత‌.. పార్టీలో ఈ ఐదు ల‌క్ష‌ల మెజారిటీపై ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. పైగా.. ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించిన రిజ‌ల్ట్ వెలువ‌డ‌కుండా.. ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ.. బీజేపీ అభ్య‌ర్థి హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

ఈ క్ర‌మంలో హైకోర్టు క‌నుక తీర్పు ఇస్తే.. ఫ‌లితం నిలిపివేసే అవ‌కాశం ఉంది. దీంతో వైసీపీలో టెన్ష‌న్ నెల‌కొంది. అయితే.. ఇక్క‌డ కూడా ఓ చిత్రం ఉంది. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన డాక్ట‌ర్ గురుమూర్తిలో ఎలాంటి టెన్ష‌న్ లేదు. కేవ‌లం మంత్రులు, ఇత‌ర ఎమ్మెల్యేలే తీవ్ర‌స్తాయిలో టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. చాలా కూల్‌గా క‌నిపిస్తోంది. కేవ‌లం ఇక్క‌డ నుంచి పోటీ చేసిన అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మి మాత్ర‌మే టెన్ష‌న్ ప‌డుతున్నారు త‌ప్ప‌.. మిగిలిన వారిలో ఎక్క‌డా టెన్ష‌న్ లేదు.

ఎందుకంటే.. ఎలాగూ ఓడిపోతామ‌నే ధీమానో.. లేక‌.. హైకోర్టు ఫ‌లితంపై స్టే విధించ‌డం ఖాయ‌మ‌నే భావ‌నో.. అర్థం కావ‌డం లేదు. మొత్తానికి టీడీపీ మాత్రం కూల్‌గానే ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇక్క‌డ గెలుపు టీడీపీకి అవ‌స‌రం. కానీ, ఇప్ప‌డున్న ప‌రిస్థితిలో గెలుపు సాధ్యం కాదు. అయితే.. ఓడిపోయినా.. స్క్రిప్ట్ రెడీగానే ఉంది. దొంగ ఓట్ల దందాతోనే వైసీపీ గెలిచింద‌నే ప్ర‌చారం చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ కూల్‌గా ఉంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.