జ‌గ‌న్‌కు త‌న‌వారిపై ఉన్న ప్రేమ‌.. జ‌నాలపై ఏదీ?

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా రెండో ద‌శ తీవ్రంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను స‌రైన విధంగా ట్రీట్ చేయాల్సిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనిని వ‌దిలి పెట్టి.. త‌న పిచ్చి చేష్ట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను క‌రోనాకు ఆహారం వేస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా 10 ల‌క్ష‌ల మంది ఇంట‌ర్ విద్యార్థులకు సంబంధించిన ప‌రీక్షల విష‌యంలో పంతానికి పోయి.. వారిని క‌రోనా బారిన ప‌డేలా చేస్తున్నార‌ని.. అన్నారు.

విద్యార్థుల ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని.. అన్ని వైపుల నుంచి డిమాండ్లు వ‌స్తున్నా.. మొండిగా ముందుకు వెళ్తున్నాడ‌ని.. జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. విద్యార్థుల ప‌రీక్ష‌ల‌కు క‌రోనా అడ్డు కాద‌ని వాదిస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా గురువారం నిర్వ‌హించాల్సిన రాష్ట్ర కేబినెట్ భేటీని ఎందుకు వాయిదా వేయాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. మంత్రులు స‌హా అధికారులకు క‌రోనా భ‌యం ఉండ‌డంతో వారంతా కేబినెట్ భేటీకి వ‌చ్చేది లేద‌ని చెప్ప‌డంతోనే జ‌గ‌న్ దీనిని వాయిదా వేసుకున్నాడ‌ని.. మ‌రి కేబినెట్ కు ఉన్న క‌రోనా భయం.. ప్రాణ భీతి.. చిన్నారులైన ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉండ‌దా? ఇదేం పాల‌న జ‌గ‌న్‌? అని లోకేష్ నిల‌దీశారు.

రాష్ట్రంలో క‌రోనా కేసులు కూడా దాస్తున్నార‌ని, మృతుల సంఖ్య‌ను కూడా త‌గ్గించి చూపుతున్నార‌ని.. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ని.. ఇప్ప‌టికైనా నిజాయితీగా క‌రోనా బాధితుల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని.. లోకేష్ సూచించారు. తాజాగా హైకోర్టు కూడా ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టిన విష‌యాన్ని లోకేష్ గుర్తు చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌చారానికి ఇస్తున్న ప్రాధాన్యం క‌రోనా నియంత్ర‌ణ‌పై పెట్ట‌డం లేద‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ ప్ర‌చారం ఎందుకు చేస్తున్నార‌ని హైకోర్టు మొట్టి కాయ‌లు వేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా లోకేష్ గుర్తు చేశారు. క‌రోనా చ‌ర్య‌ల‌ను కూడా ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని.. ప్ర‌తిదానినీ రాజ‌కీయంచేయ‌డం మానుకోవాల‌ని, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.