కేజ్రీవాల్ కి చావు దెబ్బ

గడచిన పదేళ్ళకు పైగా కంట్లో నలుసులాగ తయారైన అరవింద్ కేజ్రీవాల్ అధికారాలకు నరేంద్రమోడి కత్తెర వేసేశారు. అంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ప్రధానమంత్రి మోడి కేవలం ఉత్సవ విగ్రహంలాగ తయారు చేశారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ ప్రభుత్వం సవరణ చట్టం-2021 ప్రకారం సీఎంగా కేజ్రీవాల్ కున్న అన్నీ అధికారాలను కేంద్రప్రభుత్వం తన చేతిలోకి తీసేసుకున్నది. తీసుకున్నది అనేకన్నా లాగేసుకున్నారని అనటమే కరెక్టు.

నిజానికి ఢిల్లీకి రాష్ట్రహోదా ఉన్నా ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంది. కీలకమైన శాంతి భద్రతలు, పోలీసులు, భూమి సంబంధిత అధికారాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. ఇపుడు తాజాగా అమల్లోకి వచ్చిన సవరణ చట్టం ప్రకారం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, అటవీ, రవాణా లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) అనుమతి తప్పనిసరి.

ఒకవేళ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న ఎల్జీ గనుక ఆమోదించకపోతే చేసేదేమీలేదు. అంటే ఇప్పటినుండి ఎల్జీని ముందుపెట్టి నరేంద్రమోడి ప్రభుత్వం కేజ్రీవాల్ ను సతాయించటం మొదలవ్వటం ఖాయమని అర్ధమైపోతోంది. గతంలో కూడా మోడి ఒకసారి ఎల్జీకే అధికారాలను కట్టబెట్టాలని ప్రయత్నిస్తే ఢిల్లీ హైకోర్టు అడ్డుకుంది. కొంతకాలం కామ్ గా ఉన్న మోడి ఇపుడు ఏకంగా చట్టాన్నే సవరించేశారు. దీనిప్రకారం ఇపుడు కేజ్రీవాల్ ప్రోటోకాల్ కు మాత్రమే పరిమితమవుతారంతే.

మోడి ప్రభుత్వం తాజాగా చేసిన చట్ట సవరణపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్ట్ నెంట్ గవర్నరే అని అనుకోవాలి. నిజానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఏదో విధంగా అధికారాలను చెలాయించ గలుగుతున్నది బీజేపీ. అయితే గడచిన పదేళ్ళుగా ఢిల్లీలో మాత్రం మోడి, బీజేపీ ఆటలు సాగటంలేదు. అందుకనే ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కాదని ఓ తోలుబొమ్మ చేతికి అధికారాలను కట్టబెట్టేశారు మోడి.

దీంతో ఎలాగైనా కేజ్రీవాల్ ను దెబ్బకొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా కేజ్రీవాల్ ను దెబ్బకొట్టడం సాధ్యం కాదని అర్ధమైపోయింది. అందుకనే పరిమితమైన అధికారాలతోనే అయినా పూర్తిస్ధాయి స్వయం ప్రతిపత్తి గలిగిన యూనియన్ టెరిటరీ ఢిల్లీ చట్టాన్నే సవరించేశారు. మరి తాజాగా కేంద్రం చేసిన చట్ట సవరణ న్యాయసమీక్ష ముందు నిలబడుతుందా ?