సన్‌రైజర్స్ జట్టులో ఇతనెందుకున్నాడు?


హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. వేదిక మారినా ఆ జట్టు రాత మారలేదు. ఢిల్లీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. ఒకట్రెండు ఓటములంటే కామనే కదా అనుకోవచ్చు. కానీ ఆరు మ్యాచుల్లో ఐదు ఓడిపోవడమంటే దారుణం. ఇప్పటిదాకా సన్‌రైజర్స్ చరిత్రలోనే ఇంత పేలవ ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. ప్రతి మ్యాచ్‌కూ పుంజుకుంటుందని ఆశించడం, చివరికి నిరాశకు గురి కావడం అభిమానులకు అలవాటైపోయింది.

బుధవారం చెన్నై చేతిలో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తయింది. సన్‌రైజర్స్ ఎంతో కష్టపడి 173 పరుగులు చేస్తే.. అంత లక్ష్యాన్ని ఇంకో 9 బంతులుండగానే 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది చెన్నై. మేటి బౌలింగ్ జట్టుగా పేరున్న సన్‌రైజర్స్‌పై ఒక దశలో వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది సీఎస్కే. దీన్ని బట్టి హైదరాబాద్ డొల్లతనం అర్థమైపోతుంది.

ఈ మ్యాచ్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే.. ‘ఆల్‌రౌండర్’గా పేరున్న విజయ్ శంకర్‌కు బ్యాటింగూ ఇవ్వలేదు. అతడితో బౌలింగూ చేయించలేదు. మూడో వికెట్ పడ్డాక కేదార్ జాదవ్ వచ్చాడు కానీ.. విజయ్‌ను పంపలేదు. తర్వాత చెన్నై ఓపెనర్లు వీర బాదుడు బాదుతుంటే.. ఎన్నో బౌలింగ్ మార్పులు చేసి అలసిపోయిన వార్నర్.. విజయ్‌కు మాత్రం బంతి ఇవ్వలేదు. గత మ్యాచ్‌లో అతణ్ని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దించడం గమనార్హం. విజయ్ శంకర్ పేరుకే ఆల్‌రౌండర్ కానీ.. ఎప్పుడూ కూడా ఆ హోదాకు న్యాయం చేసింది లేదు. ఎంతోమంది ప్రతిభావంతులు అవకాశం కోసం ఎదురు చూస్తుండగా.. సన్‌రైజర్స్ అతణ్ని ఎందుకు తుది జట్టులో ఆడిస్తోందన్నది అర్థం కాని విషయం.

ఆడించినపుడు బ్యాటింగ్‌, బౌలింగ్ ఇవ్వకపోవడం మరింత ఆశ్చర్యం. బహుశా సన్‌రైజర్స్ యాజమాన్యం అయిన సన్ గ్రూప్ వాళ్లు.. తమిళ కోటాలో అతడికి బలవంతంగా తుది జట్టులో చోటు ఇప్పిస్తున్నారేమో.. కెప్టెన్ వార్నర్‌కు అది నచ్చక అతడికి బ్యాటింగ్, బౌలింగ్ ఇవ్వట్లేదేమో అనిపిస్తోంది. శంకర్ వల్ల ఇప్పటిదాకా జట్టుకు ఏ ప్రయోజనం చేకూరలేదు. ఒక మ్యాచ్‌లో బ్యాటుతో, బంతితో రాణించినా జట్టుకది ఉపయోగపడలేదు. పలు మ్యాచుల్లో సన్‌రైజర్స్ మిడిలార్డర్ కుప్పకూలింది. మిడిలార్డర్ బలహీనతే జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం. అయినా సరే.. శంకర్ లాంటి ఆటగాడిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారన్నది అర్థం కాని విషయం.