సల్మాన్ అత్యాశ కొంప ముంచుతుందా?

కరోనా విలయం ఎలా ఉన్నప్పటికీ గత ఏడాదిలా ఈసారి రంజాన్ పండక్కి సల్మాన్ రాజీ పడాలని అనుకోలేదు. మే 13న ఈద్ కానుకగా తన కొత్త సినిమా ‘రాధె’ను రిలీజ్ చేయడానికి డిసైడైపోయాడు. దేశవ్యాప్తంగా ఎక్కడా థియేటర్లు సరిగా నడవని పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసి ఏం చేసుకుంటాడనే ప్రశ్న తలెత్తకుండా.. థియేటర్లతో పాటు ఒకేసారి ‘జీ’ ఓటీటీలో, డీటీహెచ్‌ల్లో (ఆన్ డిమాండ్) సినిమాను విడుదల చేయడానికి ‘రాధె’ టీం ఫిక్సయింది.

‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ భారీ చిత్రానికి టికెట్ రేటు ఎంత పెడతారా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఈ సినిమా చూసేందుకు 249 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఐతే ఈ రేటు చాలా ఎక్కువ అనే అభిప్రాయం ఎక్కువమందిలో వ్యక్తమవుతోంది.

ఇంతకుముందు ‘ఖాలీ పీలీ’ అనే చిన్న సినిమాకు ‘జీ’ ఓటీటీ రూ.200 టికెట్ రేటు పెట్టి పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తే సరైన స్పందన లేకపోయింది. ఐతే ఈ సినిమాకు అంత మంచి టాక్ ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నది సల్మాన్ సినిమా. ‘రాధె’పై అంచనాలూ తక్కువగా ఏమీ లేవు. థియేటర్‌కు ఒక కుటుంబం వెళ్లి సినిమా చూస్తే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చవుతున్నపుడు ఇంట్లో కూర్చుని రూ.249 పెట్టి కుటుంబమంతా సినిమా చూడలేరా అన్నది చిత్ర బృందం ఆలోచన కావచ్చు. కానీ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు పెట్టి, మళ్లీ సినిమా చూసేందుకు ఇంత రేటు పెట్టాలంటే జనాలు ఆలోచిస్తారు. చాలా ఓటీటీల ఏడాది సబ్‌స్క్రిప్షన్లు రూ.300తో మొదలై రూ.1000కే వస్తుండగా.. ఒక సినిమాకు ఇంత రేటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘రాధె’ టీం అత్యాశ వల్ల సినిమాకు చేటు జరిగినా జరగొచ్చు అనే హెచ్చరికలూ వస్తున్నాయి.

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలను ఈజీగా పైరసీ చేస్తున్నారని.. డీటీహెచ్‌ల్లో కూడా సినిమాను రిలీజ్ చేస్తే పైరసీ మరింత సులువవుతుందని.. ‘పే పర్ వ్యూ’ రేటు తక్కువ ఉంటే జనాలు డబ్బులు పెట్టి వెంటనే సినిమా చూసేస్తారని.. రేటు ఎక్కువ కాబట్టి రీచ్ తగ్గుతుందని, అలాగే జనాలు ఒక రోజు ఆగి పైరసీ వైపు మళ్లే ప్రమాదం ఉందని.. కాబట్టి ఈ నిర్ణయం రాధె’ను దెబ్బ కొట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.