హైకోర్టు దెబ్బకు మేల్కొన్న సీఎం

హైకోర్టు దెబ్బకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తూత్తుకుడిలో ఎప్పుడో మూసేసిన స్టెరిలైట్ ఫ్యాక్టరీని తెరిపించి అందులో ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ అవసరమైతే ప్రస్తుత పళనిస్వామి లెక్క ప్రకారం 250 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తవుతోంది.

ఇదే విషయమై మూడు రోజుల క్రితం హైకోర్టు ప్రభుత్వానికి బాగా తలంటేసింది. ఎందుకంటే తూత్తుకుడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీని వాతావరణ కాలుష్యం కారణంగా 2018లో ప్రభుత్వం మూసేయించింది. ఇందులో ఆక్సిజన్ తయారుచేసే ప్లాంట్లు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో పెరిగిపోతున్న కేసులు, ఆక్సిజన్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని స్టెరిలైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వేదాంత గ్రూపు ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పెట్టింది.

తమ ఫ్యాక్టరీలో ఉన్న ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని కోరింది. తాము తయారుచేసే ఆక్సిజన్ను ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తామని కూడా చెప్పింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయమై హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యంపడింది. ఈ కేసు విచారణలో భాగంగా వాస్తవాలను గ్రహించిన న్యాయస్ధానం ప్రభుత్వాన్ని గట్టిగా వాయించేసింది. కంపెనీ యాజమాన్యం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని ముందుకొచ్చినా ఎందుకని అంగీకరించలేదని నిలదీసింది. 24 గంటల్లో ఫ్యాక్టరీని తెరిపించాలని కూడా ఆదేశించింది.

దాంతో పళనిస్వామి సోమవారం అఖిలపక్షాలతో సమావేశం జరిపి స్టెరిలైట్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ తయారీకి అనుమతించారు. దీనివల్ల తొందరలోనే ఇపుడున్న ఉత్పత్తికి అదనంగా 350 టన్నుల ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది. అంటే తమిళనాడు వ్యాప్తంగా పెరుగుతున్న కేసులకు తగ్గట్లుగా ఆక్సిజన్ సరిపోతుందని అనుకోవచ్చు. మొత్తానికి చేతులు పూర్తిగా కాలకముందే పళనిస్వామి ఆకులు పట్టుకున్నారనే చెప్పాలి.