థియేట్రికల్ రిలీజ్ క్యాన్సిల్.. నేరుగా ఓటీటీలోనే

గత ఏడాది కరోనా కారణంగా తలెత్తిన లాక్ డౌన్ వల్ల మూత పడ్డ థియేటర్లు ఏడు నెలల పాటు తెరుచుకోలేదు. తర్వాత థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులు వచ్చినా అవి పూర్తి స్థాయిలో నడవడానికి బాగానే టైం పట్టింది. ఐతే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ త్వరగానే కుదురుకుంది. ఇక్కడ థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు తెచ్చుకున్నాయి.

ఇక మళ్లీ గత ఏడాది చూసిన విపత్కర పరిస్థితి ఎప్పటికీ రాదనే అనుకున్నారంతా. కానీ గత కొన్ని వారాల్లో ఉన్నట్లుండి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్ల మీద ఆంక్షలు తప్పలేదు. ప్రభుత్వం ఆదేశించకున్నా సరే.. థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేసే పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ నెలలో ముందు షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలు.. ఆ తర్వాత రేసులోకి వచ్చిన చిన్న సినిమాలు వాయిదా పడక తప్పలేదు.

‘విరాట పర్వం’ రిలీజ్ వాయిదా పడటంతో అది రావాల్సిన ఏప్రిల్ 30కి అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ షెడ్యూల్ కావడం.. తర్వాత థియేటర్లు పూర్తిగా మూత పడుతున్న పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేయాల్సి రావడం తెలిసిందే. ఐతే ఇప్పుడిప్పుడే పరిస్థితులు బాగుపడేలా లేకపోవడంతో ఈ సినిమాకు పూర్తిగా థియేట్రికల్ రిలీజ్ ఆపేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ‘ఆహా’ ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడానికి డిసైడయ్యారు. మే 7న ఈ సినిమాకు ‘ఆహా’లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. బహుశా ఈ చిత్రాన్ని 30న థియేటర్లలో రిలీజ్ చేసి ఉన్నా వారానికే ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదిరి ఉండొచ్చు. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఆ తేదీనే సినిమాను ఆహాలో వదిలేస్తున్నారు. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.