‘ఆచార్య’ నుంచి చరణ్ పాట లీక్


క్రేజీ సినిమాలు మేకింగ్ దశలో ఉండగా.. అందులోని సన్నివేశాలను పాటలను ఆన్ లైన్లో లీక్ చేసేయడం పెద్ద బెడదగా మారిపోతోంది ఈ మధ్య. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఎంత కట్టడి చేసినప్పటికీ.. సినిమాలోని కంటెంట్‌ను బయటపెట్టేయడం జరుగుతోంది. ‘బాహుబలి’ నుంచి ‘వకీల్ సాబ్’ దాకా చాలా చిత్రాలకు ఈ సమస్య తప్పలేదు. ఇప్పుడు ‘ఆచార్య’ టీంకు లీక్ దెబ్బ తాకింది. ఆ సినిమా నుంచి ఒక పాట బయటికి వచ్చేసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్యే వీళ్లిద్దరిపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించారు. ఇందులో పూజా పాత్ర పేరు నీలాంబరి అని ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ పేరు మీదే పాటను తీర్చిదిద్దారు. ఆ నీలాంబరి పాటే ఇప్పుడు ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఎవరు, ఎలా లీక్ చేశారన్నది తెలియట్లేదు కానీ.. ఈ పాట విన్నవాళ్లందరూ చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది ట్రెండ్ అవుతోంది. ఈపాటికి ‘ఆచార్య’ సినిమాలో చరణ్, పూజా హెగ్డే పార్ట్ అంతా షూటింగ్ అయిపోవాల్సింది కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది.

తాజాగా పూజా కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు. ఆమెతో కలిసి పని చేసిన వాళ్లందరూ కూడా పరీక్షలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ముందు అనుకున్న ప్రకారం అయితే మే 13న ‘ఆచార్య’ విడుదల కావాల్సింది. కానీ అనివార్య పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయక తప్పట్లేదు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. జూన్ లేదా జులైకి సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణే నిర్మిస్తున్నాడు.