ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న సీఎం

తెలుగురాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అడ్డుకుంటున్నారు. తమిళనాడు నుండి తెలుగురాష్ట్రాలకు సరఫరా అవుతున్న ఆక్సిజన్ నిల్వలను నిలిపేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాయటం ఇఫుడు సంచలనంగా మారింది. తమిళనాడులో కూడా ఆక్సిజన్ అవసరాలు బాగా పెరిగిపోతున్న కారణంగా తెలుగురాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయటం కుదరదంటు సీఎం నిక్కచ్చిగా తన లేఖలో స్పష్టంచేశారు.

ఆక్సిజన్ అవసరమైన పాజిటివ్ కేసులు తమిళనాడులో కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయట. శ్రీపెరుంబదూరులో ఉన్న ఆక్సిజన్ ప్లాంటులో ఉత్పత్తవుతున్న 80 టన్నుల ఆక్సిజన్ మొత్తాన్ని ఆంధ్ర, తెలంగాణాకు సరఫరా చేస్తోంది కేంద్రం. దీన్ని అడ్డుకునేందుకు ఇపుడు పళనిస్వామి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమిళనాడుకు రోజుకు 450 టన్నుల ఆక్సిజన్ అవసరం అయితే 220 టన్నులే సరిపోతుందని కేంద్రం వేసిన లెక్కలు తప్పని సీఎం చెప్పారు.

ఆక్సిజన్ అవసరాలపై కేంద్రం తప్పుడు లేక్కల కారణంగానే తమ దగ్గర ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ను తెలుగురాష్ట్రాలకు తరలిపోతున్నట్లు ఆరోపించారు. తమ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు ఆక్సిజన్ సరిపోవాలంటే రోజుకు 310 టన్నుల ఆక్సిజన్ అవసరమన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో రోగులకు ఆక్సిజన్ అవసరాలు బాగా పెరిగిపోతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి భవిష్యత్తవసరాలను దృష్టిలో పెట్టకుని తమ దగ్గర ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ను తెలుగురాష్ట్రాలకు పంపటం కుదరని తేల్చేశారు.

తమిళనాడు సీఎం అభ్యంతరాలను గనుక పరిగణలోకి తీసుకుంటే తెలుగురాష్ట్రాలకు మరిన్ని ఇబ్బందులు తప్పదు. తమ దగ్గర ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు పళనిస్వామి ప్రయత్నాలు చేయాలేకానీ ఇతర రాష్ట్రాలకు పంపద్దని అభ్యంతరాలు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. 300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న పరిశ్రమలు కొన్ని తమిళనాడులో మూతపడున్నాయని మొన్ననే కోర్టు దృష్టికివచ్చింది. అలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకుని ఉత్పత్తిని పెంచుకుంటే బాగుంటుంది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.