తొందరలోనే మినీ లాక్ డౌన్ ?

దేశవ్యాప్తంగా తొందరలోనే మినీ లాక్ డౌన్ విధించే సూచనలు కనబడుతున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతంగా పెరిగిపోతుండటం, ఆక్సిజన్ నిల్వలు లేక చాలామంది రోగులు చనిపోతుండటం లాంటి ఘటనల కారణంగా లాక్ డౌన్ తప్పని పరిస్దితులు కనబడుతున్నాయి. ఇదే సమయంలో మినీ లాక డౌన్ పెట్టడానికి కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి.

తాజాగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం గడచిన వారంరోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 10 శాతం దాటిపోయినా ఆక్సిజన్, ఐసీయూలో పడక భర్తీ 60 శాతానికి మించిపోయినా వెంటనే మినీలాక్ డౌన్ విధించవచ్చని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది. మార్గదర్శకాలను అమలు చేయటానికి నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, వార్డులు, పంచాయితీలుగా వర్గీకరించి స్ధానిక పరిస్దితుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే ఇప్పటికే ఇలాంటి వాతావరణం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు అర్ధమైపోతోంది. పాజిటివిటీ రేటు 10 శాతం సంగతి పక్కనపెట్టేసినా ఆక్సిజన్ అందక, ఐసీయూలో చేరేవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అత్యంత బాధాకరం ఏమిటంటే ఆక్సిజన్ అందక చనిపోతున్నవారి సంఖ్య తక్కువేమీకాదు. అలాగే ఆసుపత్రుల్లో చేర్చుకోక రోగులను బయటకు పంపేస్తున్న ఘటనలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లోనే చేర్చుకోకపోతే ఇక ఐసీయూలోకి ఎలా రానిస్తారు ?

పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులను నియంత్రించాలంటే లాక్ డౌన్ ఒకటే మార్గంగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఇందుకు జనాలు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానమే. ఎందుకంటే స్వేచ్చగా అంటే నిబంధనలు ఉల్లంఘించి తిరిగేయటానికి మెజారిటి జనాలు బాగా అలవాటుపడిపోయారు. భౌతికదూరం పాటించటం ఎలాగూ సాధ్యంకాదు. కనీసం మాస్కులు పెట్టుకోమంటే చాలామంది పెట్టుకోవటంలేదు. దీనివల్లే సమస్య బాగా ముదిరిపోయి కేసులు విపరీతంగా పెరిగిపోతోంది. సో పరిస్ధితిని చక్కదిద్దాలంటే మళ్ళీ లాక్ డౌన్ ఒకటే మార్గమనిపిస్తోంది.