సునీల్ భార్యగా అనసూయ


టీవీ యాంకర్లను సామాన్య జనం చూసే దృష్టి కోణాన్నే మార్చేసిన వాళ్లలో అనసూయ ఒకరు. యాంకర్ అంటే మరీ ట్రెడిషనల్‌గా కనిపించాల్సిన అవసరం లేదని, సెక్సీగానూ దర్శనమివ్వొచ్చని చూపించి.. తన గ్లామర్‌తో జబర్దస్త్ లాంటి షోలకే ఆకర్షణ తెచ్చిన ఘనత అనసూయకు దక్కుతుంది. ఐతే బుల్లితెరపై ఎంత గ్లామర్ విందు చేసినా.. వెండి తెర మీద మాత్రం ఆమె ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాత్రలే చేసింది. అందులో ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర ఒకటి. ఆ పాత్ర అనసూయకు ఎంత గుర్తింపు తెచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఆ స్థాయి క్యారెక్టర్ చేయలేదు.

ఐతే ఇప్పుడు మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో అనసూయ నటిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప’ షూట్‌లో ఇటీవలే అనసూయ జాయిన్ అయింది. ముందు కాస్టింగ్ ఎంపిక సమయంలో అనసూయకు చోటు లేదు. కానీ తర్వాత ఆమెను ఓ పాత్ర కోసం ఎంచుకున్నాడు సుక్కు.

‘రంగస్థలం’లో మాదిరి ‘పుష్ప’లో అనసూయది మరీ పెద్ద పాత్రేమీ కాదట. ఆమెకు తక్కువ సన్నివేశాలే ఉన్నాయి. కానీ కథలో కీలకంగానే ఉంటుందట. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని, ఇందులో సునీల్‌కు భార్యగా తను కనిపించనుందని సమాచారం. పూర్తిగా రాయలసీమ యాసతో సాగే ఈ పాత్ర నచ్చి తక్కువ నిడివి అయినా సరే చేయడానికి ముందుకు వచ్చిందట అనసూయ. ప్రస్తుతం సునీల్, అనసూయ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అయితే షూటింగ్‌కు రావట్లేదని.. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హీరోతో ముడిపడ్డ భారీ సన్నివేశాల చిత్రీకరణ వాయిదా వేసి.. చిన్న చిన్న సీన్లు తీసేస్తున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా ముందు అనుకున్నట్లు ఆగస్టు 13కు రావడం దాదాపు అసాధ్యం అన్నది చిత్ర వర్గాల మాట. అసలే షూటింగ్ ఆలస్యమవుతుంటే.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు షెడ్యూళ్లన్నీ మారిపోయాయని.. కాబట్టి కొత్త డేట్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.