ర‌త్న‌ప్ర‌భ‌కు ఏపీ బీజేపీ నేత‌లే దెబ్బేశారా ?

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి ర‌త్నప్ర‌భ‌.. హైకోర్టులో పిటిష‌న్ వేశారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఎన్నికల అక్రమాలపై ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి తామిచ్చిన వినతి ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఆందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, తిరుపతి లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

అయితే.. ర‌త్నప్ర‌భ కు రాష్ట్ర బీజేపీ నేత‌లు ఎవ‌రూ అండ‌గా నిల‌బ‌డ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఆమె పోటీ చేసిన పార్టీ చిన్నా చిత‌కా పార్టీ యేమీ కాదు. బీజేపీ కేంద్రంలో బ‌ల‌మైన ప‌క్షంగా అధికారంలో ఉంది. అలాంట‌ప్పుడు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయ‌లేదనే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. అంతేకాదు, కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా దాదాపు కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన మాట‌కు, ఆదేశాల‌కు విలువ ఇస్తుంది. అలాంట‌ప్పుడు కేంద్రానికి ఎందుకు వివ‌రించ‌లేదు. ఇక‌, కేంద్రంలోని బీజేపీ నేత‌లు.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

సో.. వారికి కూడా ర‌త్నప్ర‌భ వివ‌రించే ప్ర‌య‌త్నం చేయొచ్చు. కానీ, ఆమె మాత్రం ఎవ‌రికీ చెప్ప‌కుండానే ఇప్పుడు హైకోర్టును ఆశ్ర‌యించారు. కేంద్రం ద్వారా స‌మ‌స్య‌ను సానుకూలంగా ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ర‌త్నప్ర‌భ ఇలా చేశారంటే.. ఈ విష‌యంలో ఏదో అనుమానించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. పైగా రాష్ట్ర బీజేపీ నేత‌లు కూడా కోర్టు వ్య‌వ‌హారంలో త‌మ జోక్యం లేన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేవ‌లం ర‌త్న ప్ర‌భే పిటిష‌న్ వేయ‌డం.. దీనిని రాష్ట్ర నేత‌లు ఎవ‌రూ మ‌ద్ద‌తుగా మాట్లాడ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి బీజేపీ నేత‌ల్లో చాలా మందికి ర‌త్నప్ర‌భ కేసు ఫైల్ చేసిన విష‌యం కూడా తెలియ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఆమె విష‌యం ప‌త్రిక‌లో వ‌చ్చిన త‌ర్వాతే తెలిసింద‌ని.. కోస్తాకు చెందిన బీజేపీ నేత ఒక‌రు వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తానికి ర‌త్న ప్ర‌భ‌.. వ్య‌వ‌హారంలో బీజేపీ ఆశ‌లు వ‌దిలేసుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ర‌త్నప్ర‌భ త‌న పోరాటాన్ని ఎంత దూరం తీసుకువెళ్తారో చూడాలి.