సూపర్ స్టార్ సాహసం

కరోనా ధాటికి యంగ్ హీరోలు కూడా భయపడిపోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా వరకు భారీ చిత్రాల చిత్రీకరణ ఆపేశారు. తెలుగులో ఆచార్య, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ లాంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. తమిళం, ఇతర భాషల్లోనూ చాలా సినిమాలు ఆగిపోయాయి. సెకండ్ వేవ్ ఉద్ధృతి కొంచెం తగ్గాక చూద్దామని హీరోలు ఇంటి పట్టున ఉంటున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సాహసం చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఆయన కొత్త చిత్రం ‘అన్నాత్తె’ షూటింగ్ పరిస్థితులు బాగున్నపుడు ఆగింది. కరోనా ఉద్ధృతి బాగా పెరిగిన సమయంలో ఆ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పెద్ద ఎత్తున ఈ సినిమా సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. రజినీ మీద దర్శకుడు శివ ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ సన్నివేశంలో చాలా పెద్ద సంఖ్యలోనే కాస్ట్ అండ్ క్రూ పాల్గొంటోంది.

గత ఏడాది డిసెంబరులో రజినీ హైదరాబాద్‌లోనే ‘అన్నాత్తె’ షూటింగ్‌లో పాల్గొంటుండగా చిత్ర బృందంలోని కొందరు కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్‌కు కరోనా సోకకున్నా కాస్త అస్వస్థత కారణంగా ఆసుపత్రికి వెళ్లారు. దీంతో రజినీ భయపడిపోయారు. కరోనా భయంతో రాజకీయ అరంగేట్రాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ‘అన్నాత్తె’ షూటింగ్ కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఐతే ఇటీవల మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు.

సెట్లో డాక్టర్ల బృందాన్ని పెట్టుకుని, అత్యంత జాగ్రత్త మధ్య రజినీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘అన్నాత్తె’ ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, ఈ ఏడాది నవంబరులో దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేయాల్సిందే అని నిర్ణయం తీసుకోవడంతో రజినీ రిస్క్ చేసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకో రెండు నెలల దాకా సమయం పడుతుందని సమాచారం.