మహిళా దర్శకురాలితో మహేష్?

‘సర్కారు వారి పాట’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళితోనే సినిమా చేస్తారని కొన్ని నెలల ముందు వరకు అంతా అనుకుంటూ వచ్చారు. కానీ మధ్యలోకి కొత్తగా ఒక్కో చిత్రం వచ్చి పడుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న దాని కంటే బాగా ఆలస్యం అవుతుండటమే ఇందుక్కారణం. ‘సర్కారు వారి పాట’ పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు మహేష్. అది ఈ ఏడాది ద్వితీయార్ధంలో మహేష్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు మొదలవుతుంది. వచ్చే ఏడాది మధ్యలోపు సినిమా పూర్తి కావచ్చేమో.

ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. రాజమౌళి ఎంత కష్టపడ్డా వచ్చే సంక్రాంతి లోపు అయితే సినిమా వచ్చే అవకాశం లేదంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయ్యాక మహేష్ సినిమాకు స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి తనకు ఏడాది సమయం కావాలని జక్కన్న ముందే చెప్పేశాడు. ఈ నేపథ్యంలో తనకు మరింత ఖాళీ దొరికే అవకాశం ఉండటంతో మహేష్ వేరే దర్శకుల నుంచి కథలు వింటున్నట్లు సమాచారం. ఆ జాబితాలో ఓ మహిళా దర్శకురాలు కూడా ఉన్నారన్నది తాజా కబురు. ఆమె ఎవరో కాదు.. సుధ కొంగర.

‘సాలా ఖడ్డూస్’ (తెలుగులో గురు)తో సుధ ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. ఇక సూర్యతో తీసిన ‘ఆకాశం నీ హద్దురా’తో ఆమెపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అజిత్ లాంటి సూపర్ స్టార్‌తో తన తర్వాతి సినిమా చేయబోతోంది సుధ. దాని తర్వాత మహేష్‌తో సినిమా చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. కరోనా నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఆపేసి ఇంటిపట్టునే ఉంటున్న మహేష్.. వీడియో కాల్ ద్వారా సుధతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కుదిరితే వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా రావచ్చంటున్నారు.