పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఇలాగే ఉంటుంది

పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఎలాగుంటుందో వివాదాస్సద ఆధ్యాత్మిక గురువు నిత్యానందను చూస్తే చాలు అర్ధమైపోతుంది. లైంగికపరమైన కేసుల్లో అరెస్టయి, కోర్టు విచారణ జరుగుతున్నపుడే నిత్యానంద దేశం నుండి పరారయ్యారు. ఇండియాలో ఉన్నపుడు రకరకాల వేషాలతో నోటికొచ్చిన విషయాలపై మాట్లాడే ఈ గురువుకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే శిష్యులున్నారు.

ఇలాంటి గురువు దేశంనుండి పారిపోయి ఎక్కడో ఈక్వెడార్ అనే దేశంలో తేలారు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ చిన్న దీవికి పారిపోయారు. ఆ దీవిని నిత్యానంద కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపధ్యంలో ఓ విచిత్రమైన ఆదేశాలను నిత్యానంద జారీచేశారు. తానుంటున్న లేదా కొనుగోలు చేసిన దీవికి కైలాస అనే పేరుపెట్టిన విషయం తెలిసిందే.

కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక మిలిటరీ, ప్రత్యేక వీసా, పాసుపోర్టు లాంటి ఎన్నో ప్రత్యేకతలను ప్రకటించారు. దాంతో మనదేశంలో నిత్యానంద పెద్ద క్యామిడి స్టార్ అయిపోయారు. అలాంటి కైలాస దేశానికి మనదేశం నుండి జనాలను నిషేధించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తమ దేశంలోకి భారతీయులను నిషేధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేయటమే పెద్ద క్యామిడి అయిపోయింది.

మనదేశమనే కాదు బ్రెజిల్, యూరోపుదేశాలు, మలేషియా లాంటి దేశాల నుండి కూడా ప్రయాణీకులను కైలాసకు రాకుండా నిషేధించినట్లు ప్రకటించటంతో నెటిజన్లు ఒకటే నవ్వుకుంటున్నారు. కైలాసియన్లు, ఎకైలాసియన్లు, తమ దేశ రాయబార కార్యాలయంతో సంబంధాలున్న వాలంటీర్లంతా క్వారంటైన్లోకి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీచేశారు నిత్యానందులవారు.