ఇలా వ‌చ్చి.. అలా క‌నుమ‌రుగు.. వీరేమ‌య్యారు ?

వారంతా రాజ‌కీయాల‌కు కొత్త‌కాదు. వారి త‌ల్లో, తండ్రో సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాలు చేసిన వారే. వివిధ ప‌ద‌వులు సైతం అలంక‌రించినవారే. రాష్ట్ర వ్యాప్తంగా చ‌క్రాలు తిప్పిన వారే. వీరిలో కొంద‌రు మంత్రులుగా, రాష్ట్ర ముఖ్య‌మంత్రులుగా చేసిన వారి వార‌సులు, స్పీక‌ర్‌గా చ‌క్రం తిప్పిన వారి వార‌సులు.. కూడా ఉన్నారు. అయితే.. అనివార్య కార‌ణాలు కావొచ్చు.. క‌లిసి వ‌చ్చిన అంశాలు కావొచ్చు.. వారివారి వార‌సులుగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. కొంద‌రికి గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు కూడా ల‌భించాయి. మ‌రికొంద‌రికి కేవ‌లం హామీలు ల‌భించాయి. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వీరు అదృశ్యం కావ‌డ‌మే చిత్రం.

2019 ఎన్నిక‌లు జ‌రిగి రెండేళ్లు పూర్త‌య్యాయి. అయితే.. అప్ప‌ట్లో జ‌నాల మ‌ధ్య‌కు వ‌చ్చి.. ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు తెర‌దీసిన వారు ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వీరంతా యువ నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీరికి ఏమైంది? ఒక్క ఓట‌మితోనే కుదేల‌య్యారా? లేక అస‌లు రాజ‌కీయాల్లోకి ఒక ప్ర‌యోగం చేద్దాం అనుకుని వ‌చ్చారా? ఇవ‌న్నీ కాక‌.. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌లుద్దాంలే అనుకుని దూర‌మ‌య్యారా? ఇవ‌న్నీ ఇప్పుడు స‌మాధానం లేని ప్ర‌శ్న‌లే. కానీ, వారెవ‌రో చూద్దాం..

నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌: నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి, రాజ్య‌లక్ష్మి దంప‌తుల కుమారుడు, జ‌నార్ద‌న్‌రెడ్డి ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా ప‌నిచేయ‌గా.. త‌ర్వాత రాజ్య‌ల‌క్ష్మి.. వైఎస్ కేబినెట్‌లో మినిస్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఇక‌, వీరి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌ద్దామ‌నుకున్న నాయ‌కుడు నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చి మ‌రీ.. ఆయ‌న‌ను క‌లిసి.. వెంక‌ట‌గిరి టికెట్ అడిగార‌నే ప్ర‌చారం సాగింది. కానీ.. ఆ టికెట్ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి రామ్ గురించిన ప్ర‌స్తావ‌నే లేకుండా పోయింది. మ‌ధ్య‌లో ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపుతార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక వేళ కూడా ఆయ‌న హ‌డావిడి ఎక్క‌డా లేదు.

గుమ్మ‌డి రాజేష్‌: ఉమ్మ‌డి ఏపీలో ఒక‌ప్పుడు కాంగ్రెస్ నేత‌ల్లో కీల‌క‌మైన నాయ‌కురాలిగా చ‌క్రం తిప్పిన గుమ్మ‌డి కుతూహ‌ల‌మ్మ కుమారుడు రాజేష్‌. గంగాధ‌ర‌నెల్లూరు నుంచి ప‌లుమార్లు విజ‌యం ద‌క్కించుకున్న కుతూహ‌లమ్మ రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో టీడీపీలో చేరారు. ఈ క్ర‌మంలో త‌న‌కుమారుడు గుమ్మ‌డి రాజేష్‌కు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే.. ఆయ‌న డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి చేతిలో ఓడిపోయారు. త‌ర్వాత మ‌ళ్లీ రాజ‌కీయంగా ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కైనా ప్రిపేర్ అవుతున్నారా? అంటే అది కూడా లేదు.

ష‌బానా ఖ‌తూన్: విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నేత‌, జ‌లీల్ ఖాన్ కుమార్తె ష‌బానా ఖ‌తూన్‌. గ‌త 2019 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా రాజ‌కీయ అరంగేట్రం చేసి.. టీడీపీ టికెట్‌పై ప‌శ్చిమం నుంచి పోటీ చేసిన ఆమె.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. గెలిచినా.. ఓడినా.. ప్ర‌జ‌ల‌మ‌ధ్యే ఉంటాన‌ని.. హామీ ఇచ్చిన ఖ‌తూన్ ఎన్నిక‌ల ఫ‌లితం రాగానే ఓడిపోవ‌డంతో అమెరికా వెళ్లిపోయారు. ఇప్పుడు ఎక్క‌డా ఆమె పేరు త‌లుచుకునే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు.

గంటి హ‌రీష్ మాధుర్‌: లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్‌.. గంటి మోహ‌న్‌చంద్ర బాల‌యోగి కుమారుడు.. గంటి హ‌రీష్ మాధుర్‌. గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌(చంద్ర‌బాబు బ‌ల‌వంతంగా తీసుకువ‌చ్చార‌నేది అంత‌ర్గ‌త టాక్‌) ఆయ‌న అమ‌లాపురం పార్ల‌మెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ బాధ్య‌త‌లు చూస్తున్నార‌ని అంటున్నా.. ఎక్క‌డా ఆయ‌న క‌నిపించ‌డం లేదు. పైగా.. టీడీపీ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రుకావ‌డం లేదు. సో.. ఇలా చాలా మంది నేత‌లు… ఇలా వ‌చ్చి అలా క‌నుమ‌రుగ‌వ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీరికి రాజ‌కీయ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి.