నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్‌.. ఐసీయూలో 22 మంది మృతి

క‌రోనా రెండ ద‌శ వ్యాప్తి అనేక అవ‌స్థ‌లు తెచ్చిపెడుతోంది. క‌రోనా బారిన ప‌డిన వారికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌… ప్ర‌భుత్వాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి. చాలా చోట్ల ఆక్సిజ‌న్ అంద‌క రోగులు మృత్యువాత ప‌డుతున్నారు. తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆక్సిజన్‌ అందక ఏడుగురు కొవిడ్‌ రోగులు మృతిచెందారు. ఆక్సిజన్‌ కోసం పదేపదే వినతులు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువవ్వడంతో ఈ దుస్థితి నెలకొందని రోగుల బంధువులు ఆరోపించారు.  కర్ణాటకలో విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ వ్యక్తిగత కార్యదర్శి రమేశ్‌ కొవిడ్‌తో మృతిచెందారు. ఆయనకు సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో చనిపోయారని వైద్యులు తెలిపారు.  

అంటే.. ఆక్సిజ‌న్ కొర‌త‌.. దేశ‌వ్యాప్తంగా క‌రోనా.. రోగుల ప్రాణాలు తీసుకున్న విష‌యం అర్ధ‌మ‌వుతోంది. అయితే.. అదేస‌మ‌యంలో ఇప్పుడు ఆక్సిజ‌న్ ఉండి కూడా ఐసీయూలో రోగులు ఒకే ద‌ఫా 22 మంది మృతి చెందారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి?  దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు.. ఇవీ..

క‌రోనాతో అల్లాడుతున్న మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌లో జాకీర్ హుస్సేన్ ఆసుప‌త్రిని ప్రభుత్వం కొవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చింది. దాదాపు వెయ్యి మందికి ఇక్కడ ఐసీయూ సౌక‌ర్యంతోపాటు సాధార‌ణ ప‌డ‌క‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. దేశంలో చాలా చోట్ల ఆక్సిజ‌న్ కు కొర‌త ఉంటే.. ఇక్క‌డ మాత్రం స‌మృద్ధిగా ఉంది. కానీ, తీవ్ర‌మైన నిర్ల‌క్ష్య‌మే.. రోగుల‌కు శాపంగా మారింది.

ప్ర‌స్తుతం ఈ ఆసుప‌త్రిలో 35 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్న క‌రోనా రోగులు ఉన్నారు. వీరికి అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే నాలుగు రోజుల పాటు ఆక్సిజ‌న్‌ను నిల్వ ఉంచుకోవాల‌నే ఉద్దేశంతో ఆసుప‌త్రి వ‌ర్గాలు రెండు ట్యాంక‌ర్ల‌ను తెప్పించి.. అన్‌లోడ్ చేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాయి. అయితే.. ఈ క్ర‌మంలో నిపుణులు ప‌ర్య‌వేక్షించాల్సి ఉండ‌గా.. దిగువ త‌ర‌గ‌తి ఉద్యోగుల‌ను ఈ ప‌నికి పుర‌మాయించిన‌ట్టు స‌మాచారం. దీంతో అన్‌లోడ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఆక్సిజ‌న్ లీకైంది.

అయితే.. దీనికి రోగులు మృతి చెంద‌డానికి సంబంధం లేదు.కానీ, ఈ స‌మ‌యంలో ఖంగారు ప‌డిన ఓ ఉద్యోగి.. ఐసీయూకు స‌ర‌ఫ‌రా అవుతున్న గొట్టాల‌ను నిలిపివేశాడు. ఇది ఖంగారులో చేశాడా?  లేక‌.. తెలియ‌క చేశాడా? అనేది విచార‌ణ‌లో తేల‌నుంది. దీంతో కేవ‌లం 20 నిముషాల‌వ్య‌వ‌ధిలోనే ఐసీయూలోని రోగుల్లో 22 మందికి ఆక్సిజ‌న్ అంద‌క‌.. ఊపిరి ఆగిపోయి మృతి చెందారు. ఒక‌వైపు ఆక్సిజ‌న్ కొర‌త‌తో దేశం అల్లాడుతుంటే.. ఇక్క‌డ ఆక్సిజ‌న్ ఉండి కూడా రోగులు నిముషాల వ్య‌వ‌ధిలో ప్రాణాలు కోల్పోవ‌డం.. ప్ర‌తి ఒక్క‌రినీ తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింది. ప్ర‌స్తుతం ఈఘ‌ట‌న‌పై థాక‌రే స‌ర్కారు విచార‌ణ‌కు ఆదేశించింది. మ‌రి ఏం తేలుస్తారో చూడాలి.